దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో ఎన్ఐఏ కోర్టు మరో నిందితుడికి శిక్ష ఖరారు చేసింది. నిందితుడు సయ్యద్ మక్బుల్ కు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఎన్ఏఐ కోర్టు గురువారం తీర్పు వెల్లడించింది.2012తో హైదరాబాద్‌లో పేలుళ్లు జరిపి విధ్వంసం సృష్టించాలని ప్రయత్నించిన ఈ 11 మందితో కూడిన గ్యాంగ్.. పాకిస్థాన్ నుంచి పేలుడు పదార్థాలు తీసుకొచ్చింది.


అయితే, దీన్ని ముందే పసిగట్టిన పోలీసులు వీరి కుట్రను భగ్నం చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నిందితులందరు ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వీరిలో నలుగురు నిందితులకు జులైలో.. కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. మరో ఆరుగురు నిందితులపై ట్రయల్ కోర్టులో విచారణ జరుగుతోంది.


నిందితులు హైదరాబాద్ లక్ష్యంగా పేలుళ్ల కుట్ర పన్నారని, పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారని ఎన్ఐఏ అధికారులు కోర్టుకు తెలిపారు. కాగా, ముజాహిద్దీన్ కుట్రగా ఈ కేసు ప్రాచుర్యం పొందింది. ఇప్పటికే ఈ కేసులో సయ్యద్ మక్బుల్ ను సెప్టెంబర్ 22వ తేదీన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు దోషిగా ప్రకటించింది. ఇక, ఈ కేసులో ఐదవ నిందితుడిగా ముక్బుల్ ఉన్నాడు.


నాందేడ్‌కు చెందిన ముక్బుల్‌ను ఉగ్ర కదలికల నేపథ్యంలో ఫిబ్రవరి 28వ తేదీన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, పాకిస్థాన్ ఉగ్ర సంస్థ ముజాద్దీన్ లోని కీలక సభ్యులతో ముక్బుల్ దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నట్లు ఎన్ఐఏ అధికారులు దర్యాప్తులో వెల్లడైంది.


హైదరాబాద్, ఢిల్లీ పేలుళ్ల కుట్ర కేసులో తీవ్రవాదులకు ప‌దేళ్ల జైలు శిక్ష‌


దేశ వ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర కేసులో ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాదులకు ఇటీవల జైలు శిక్ష ప‌డింది. నలుగురికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీ ఎన్ఐఏ ఇటీవల ప్రత్యేక కోర్టు తీర్పు వెలువ‌రించింది. నిందితులు హైదరాబాద్, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లకు రెక్కీ నిర్వహించినట్లు ఎన్ఐఏ చేసిన వాద‌న‌ల‌తో కోర్టు ఏకీభ‌వించింది.


నిందితులు పేలుళ్ల కోసం ఆయుధాలు సైతం సమకూర్చుకున్న‌ట్లు ఎన్ఐఏ పేర్కొంది. కేసుకు సంబంధించి హైదరాబాద్ కు చెందిన ఒబేద్ రహమాన్.. బీహార్ కు చెందిన ధనీష్ అన్సారీ, ఆఫ్తాబ్ ఆలం, మహారాష్ట్రకు చెందిన ఇమ్రాన్ ఖాన్ లను ఎన్ఐఏ 2013లో అరెస్ట్ చేసింది. నిందితులు ఇండియన్ ముజాహుద్దీన్ తీవ్రవాదులతో కలిసి దేశంలో పలుప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర పన్నిన‌ట్లు ఎన్ఐఏ గుర్తించింది. 2007లో గోకుల్ చాట్(Gokul Chat), లుంబినీ పార్కు(Lumbini Park) జంట పేలుళ్లు(Joint Blasts), 2013లో దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్లలో నిందితుల పాత్ర ఉన్న‌ట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.


గతంలో వారణాసి, ముంబ‌యి, ఫజియాబాద్, ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూర్ లో జరిగిన పేలుళ్లలోనూ నలుగురు నిందితుల ప్ర‌మేయం గుర్తించిన‌ట్లు ఎన్ఐఏ వెల్ల‌డించింది. ఈ కేసులలో ఎన్ఐఏ మొత్తం 11మందిని నిందితులుగా చేర్చింది. మిగతా ఏడుగురు నిందితుల్లో యాసిన్ బత్కల్, అక్తర్, రెహమాన్, తెహసిన్ అక్తర్, హైదర్ అలీ, రియాజ్ బత్కల్ తో పాటు మరో నిందితుడు ఉన్నాడు. జైల్లో ఉన్న ఐదుగురు నిందితులపై విచారణ కొనసాగుతోంది.


అయితే ఈ రెండు వేరు వేరు కేసుల్లో నిందితులపై పోలీసులు పక్కగా ఆధారాలు చూపించడంతో కోర్టు వీరికి శిక్ష పడేలా తీర్పు ఇచ్చింది. ఈ కేసుల్లో చాకచక్యం ప్రదర్శించిన పోలీసులకు యావత్ భారత్ ప్రశంసలు కురిపిస్తోంది.