Durgam Cheruvu Cable Bridge at Madhapur in Hyderabad | హైదరాబాద్: నగరంలోని టూరిస్ట్ స్పాట్‌లలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ఒకటి. మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ వద్ద ఓ యువతి ఆత్మహత్యయత్నం చేయడం కలకలం రేపింది. ట్రాఫిక్ పోలీసులు సకాలంలో స్పందించి ఆమెను అడ్డుకుని ప్రాణాలు కాపాడారు. కానీ ఆ సమయంలో కొంతసేపు కేబుల్ బ్రిడ్జి మీద హైడ్రామా చోటుచేసుకుంది. అటుగా వెళ్తున్న వాహనదారులు కేబుల్ బ్రిడ్జి మీద వాహనాలు నిలిపి ఏం జరుగుతుందో చూశారు.


దాదాపు 25 ఏళ్ల వయసు ఉన్న యువతి సోమవారం మధ్యాహ్నం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీదకు వెళ్లింది. అటూ ఇటూ గమనించిన ఆమె ఒక్కసారిగా కేబుల్ బ్రిడ్జి మీద నుంచి దుర్గం చెరువు లేక్ లోకి దూకేందుకు ప్రయత్నించింది. కేబుల్ బ్రిడ్జి వద్ద ఉండి ఇది గమనించిన మాదాపూర్ ట్రాఫిక్ సిబ్బంది అక్కడికి చేరుకుని యువతిని నీళ్లల్లోకి దూకకుండా అడ్డుకుని ఆమె ప్రాణాలు కాపాడారు. పోలీస్ వాహనంలో ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె ఎందుకు ఆత్మహత్యాయత్నం చేశారో అందుకు కారణాలు తెలియాల్సి ఉంది.