టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు కుమారుడు దోపిడీకి గురయ్యారు. హైదరాబాద్ లో ప్రధాన రహదారులపైనే ఆయన బెదిరింపులకు లోనయ్యారు. అలా దుండగులు నామా నాగేశ్వరరావు కుమారుడి నుంచి రూ.75 వేలు ఆన్ లైన్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. ఈ ఘటన జరిగాక నామా నాగేశ్వరరావు కుమారుడు పృథ్వీ తేజ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.


అసలేం జరిగిందంటే..
పృథ్వీ తేజ కారులో వెళ్తుండగా, టోలిచౌకి వద్ద ఇద్దరు దుండగులు అడ్డుకున్నారు. ఓ బైక్ ను కారుకు అడ్డంగా ఆపి బలవంతంగా కారులోకి వారు ఎక్కారు. ఆయనను కత్తితో బెదిరించి కారులోనే కూర్చొని ఆ ప్రాంతమంతా తిరిగారు. వాహనంలో నుంచి పృథ్వీని దిగకుండా అడ్డుకొన్నారు. అనంతరం కత్తితో బెదిరించి రూ.75 వేలు లాక్కున్నారు. ఈ విషయాన్ని పోలీసులకు పృథ్వీ పోలీసులకు తెలిపారు. ఆ మేరకు శనివారం రాత్రి పంజాగుట్ట పీఎస్‌లో కేసు పెట్టారు. ఈ ఘటన జులై 31 రాత్రి జరిగినట్లు చెప్పారు. ఆ రోజు సాయంత్రం షాపింగ్ కోసం పృథ్వీ తేజ ఆ ప్రాంతానికి వెళ్లారు. రాత్రి వేళ షాపింగ్ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ దోపిడీ జరిగింది.


పృథ్వీతేజ ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు ఈ ప్రాంతంలోని సీసీటీవీ పుజేజీని పరిశీలిస్తున్నారు. పృథ్వీతేజ  ఏ మార్గంలో ప్రయాణం చేశాడో  ఆ మార్గంలోని సీసీటీవీల పుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ మార్గంలో అనుమానాస్పదంగా ఎవరైనా తిరిగారా లేక పృథ్వీని ఎవరైనా వాహనంలో ఫాలో అయ్యారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎంపీ నామా నాగేశ్వరరావు కొడుకు ఓ వ్యాపారి. ఆయన జూబ్లీహిల్స్ లో నివాసం ఉంటున్నారు. జూలై 31న కారులోకి ఎక్కిన దుండగులు డ్రైవర్ సీట్‌లో ఉన్న పృథ్వీ తేజ మెడపై కత్తి పెట్టి కొండాపూర్ వైపు కారును పోనివ్వాలని బెదిరించారు. మధ్యలో ఆగి ఓ వైన్ షాపు నుంచి మద్యం తెచ్చుకొని తాగారు. మధ్యలో మరో వ్యక్తి కూడా కారు ఎక్కాడు. ఆ తర్వాత ముగ్గురూ కలిసి ఎంపీ కుమారుడిపై పిడి గుద్దులు గుద్దుతూ దాడి చేశారు. అలా గచ్చిబౌలి, టోలీచౌకి, మెహెదీపట్నం మీదుగా ఎస్ ఆర్ నగర్ వైపు వచ్చారు. ఆ ప్రాంతంలో ఓ బైకును వీరి కారు ఢీకొట్టింది. పంజాగుట్ట నిమ్స్ వద్దకు రాగానే, అదును చూసి ఎంపీ కుమారుడు కారు నుంచి దూకేశారు. ఆ తర్వాత  పోలీసులకు ఫిర్యాదు చేశారు.