రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు... హుస్సేన్ సాగర్ తీరాన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ నిర్మాణ పనుల వివరాలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మంగళవారం అడిగితెలుసుకున్నారు.  ప్రధాన విగ్రహం, రాక్ గార్డెన్, ల్యాండ్ స్కేప్ ఏరియా ప్లాంటేషన్, మెయిన్ ఎంట్రన్స్, వాటర్ ఫౌంటైన్, సాండ్ స్టోన్ వర్క్స్, జీఆర్సి, గ్రానైట్ ఫ్లోరింగ్, లిఫ్ట్ పనులు, ప్రధాన విగ్రహం వద్దకు వెళ్లే మెట్లు, ర్యాంప్ వర్క్స్, బిల్డింగ్ లోపల ఆడియో విజువల్ రూం, ఫాల్స్ సీలింగ్ తదితర వర్క్స్ నిర్మాణ ప్రాంగణమంతా పరిశీలించారు మంత్రి. అధికారులకు, వర్క్స్  ఏజన్సీకి పలు సూచనలు చేశారు.

 

అనంతరం అక్కడే అధికారులు, వర్క్ ఏజెన్సీతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రోజువారీ పనుల పురోగతిని కూలంకషంగా చర్చించారు. ఈనెల 30 వరకు ప్రధాన విగ్రహం, ఈనెల 28 వరకు ఎంట్రన్స్ లాన్స్, ఏప్రిల్ 1 వరకు రాక్ గార్డెన్, ఏప్రిల్ 5వరకు ప్లాంటేషన్ వర్క్స్ ఇలా అన్ని రకాల పనులు ఏప్రిల్ 10 లోపు పూర్తి చేసి ప్రారంభానికి సిద్దం చేయాలని మంత్రి వారికి స్పష్టం చేశారు. పనులు వేగంగా జరగాలని అందుకు తగ్గట్టుగా మ్యాన్ పవర్ పెంచాలని అధికారులను, నిర్మాణసంస్థను అదేశించారు.

 

ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14 నాడు విగ్రహ ఆవిష్కరణ చేయాలని నిర్ణయయించిన నేపథ్యంలో పనులు ప్రణాళిక ప్రకారం, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాల్సిందేనని మంత్రి తేల్చి చెప్పారు. చరిత్రలో నిలిచే ఇంత గొప్ప కట్టడంలో భాగస్వామ్యులవ్వడం మనందరికీ ఎంతో గర్వకారణం అని, కోట్ల హృదయాలను హత్తుకునే ఈ విగ్రహ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ మనసుపెట్టి పనిచేయాలని కోరారు మంత్రి వేముల. భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహ నిర్మాణంలో ఇంత గొప్ప అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసిఆర్ కి మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మంత్రి వెంట ఆర్ అండ్ బి అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఆర్కిటెక్ట్ లు తదితరులు ఉన్నారు.