Telangana News: తెలంగాణ కాంగ్రెస్‌లో అలజడి రేగింది. కొంతమంది ఎమ్మెల్యేలు గ్రూప్‌గా ఏర్పడి రహస్య సమావేశం కావడం సంచలనంగా మారుతోంది. అయితే ఆ సమావేశానికి ఎవరు వెళ్లారు. వాళ్లు ఏ ఉద్దేశంతో భేటీ అయ్యారనే విషయాలు కాంగ్రెస్ నేతల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ పరిణామాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అలర్ట్ అయ్యారు. అందుబాటులో ఉన్న నేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. 


కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ఇదే ఆపార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలో టెన్షన్ పెడుతుంది. ఎవరు ఎప్పుడైనా సమావేశాలు కావచ్చు. ఏమైనా మాట్లాడవచ్చని ఆ పార్టీ నేతలే తరచూ చెబుతుంటారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో ఇలాంటి సమావేశం ఒకటి జరిగింది. ఇది పాలకులను పరుగులు పెట్టిస్తోంది. కాంగ్రెస్‌కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమయ్యారు. హైదరాబాద్‌కు సమీపంలోని ఓ ఫామ్‌హోస్‌లో ఈ భేటీ జరిగినట్టు తెలుస్తోంది. 


తెలంగాణకు చెందిన ఓ మంత్రి వ్యవహారం కాంగ్రెస్‌లో సమస్యలు సృష్టిస్తోందని తెలుస్తోంది. ఆయనకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు ఏకమవుతున్నారు. ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలు కూడా ఇదే విషయంపై చర్చించినట్టు తెలుస్తోంది. ఆ మంత్రి తీరు నచ్చకపోవడంతోనే ఇలా రహస్యంగా సమావేశమైనట్టు చెప్పుకుంటున్నారు. 


ఈ పది మంది ఎమ్మెల్యు ఇలా సమావేశం అవ్వడానికి ఇద్దరు ఎమ్మెల్యేలు రెండు రోజుల ముందు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారట. తమకు పార్టీలో జరుగుతున్న అన్యాయం, పట్టించుకోవడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే అంశంపై పది మందితో ఫామ్‌హౌస్‌లో కూర్చొని మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. 


ఇలా పది మంది ఎమ్మెల్యేలు ఇలా వేరుగా సమావేశం కావడంతో సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యారు. అందుబాటులో ఉన్న కీలక నేతలతో సమావేశం కానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ అంశంపై అని చెబుతున్నప్పటికీ ఇది మాత్రం పది మంది ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశం కావడంపైనే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు