YS Sharmila On Kaleshwaram : సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్  ఒక అద్భుతమంటూ తెలంగాణతో పాటు దేశ ప్రజలను మోసం చేశారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు, మీడియా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి తెలుసన్నారు. 70 వేల కోట్ల అవినీతితో 2జీ, కోల్ గేట్ కు తీసిపోని స్కాం కాళేశ్వరం అన్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంత అవినీతి జరిగినా ఏ విచారణ చేపట్టలేదని ఆరోపించారు. ఈ నెల 14న వైయస్ఆర్ తెలంగాణ పార్టీ దిల్లీలో జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు మార్చ్ చేసుకుంటూ వెళ్లి దేశం మొత్తం, పార్లమెంట్ సభ్యులకు కాళేశ్వరం గురించి తెలిసేలా చేయాలని నిర్ణయించామన్నారు. వైయస్ఆర్ 38 వేల ఐదు వందల కోట్లతో అంబేడ్కర్ ప్రాణహిత చేవెళ్ల అనే పేరుతో ప్రాజెక్టుకు రూపకల్పన చేసి 16 లక్షల 40 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని తలిస్తే కేసీఆర్ అదే ప్రాజెక్టును రీడిజైనింగ్ పేరుతో లక్షా 20 వేల కోట్ల ఖర్చుతో కేవలం 18 లక్షల 25 వేల 700 ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చేలా చేశారన్నారు. ఇంత ఖర్చు చేసి అసెంబ్లీలో మంత్రి కేవలం లక్షా 50 వేల ఎకరాలకు కాళేశ్వరం నీళ్లు ఇచ్చిందని చెబుతున్నారన్నారు.  కాళేశ్వరం అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్ట్ అని విమర్శించారు. కమీషన్ల కోసమే చేసిన ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు. 


అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్ట్ 
 
"అవసరం లేని బ్యారేజ్ లు, మెయిన్ కెనాల్స్, అప్రోచ్ కెనాల్స్ , పంప్ హౌస్ లు, సైడ్ కెనాల్స్, బాహుబలి మోటార్లు. అవసరం లేని దాని మీద లక్షల కోట్లు ఖర్చు పెట్టి అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్ట్ చేశారు. రెండు టీఎంసీల చొప్పన 90 రోజులకు గాను 180 టీఎంసీల నీళ్లు కాళేశ్వరం నుంచి తీసుకోవచ్చు. ఇంత వరకు కనీసం ఏ  ఒక్క సంవత్సరం కూడా అర్ధ టీఎంసీకి మించి నీళ్లు తీసుకోలేదు.  కేవలం 30 టీఎంసీల నీళ్లు మాత్రమే అందించారు. ప్రభుత్వ లెక్కలే ఒక సంవత్సరం 50 వేల ఎకరాలకు, ఒక సంవత్సరం 57 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చామని అని చెబుతున్నాయి. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కేసీఆర్ కాళేశ్వరం నీళ్లతోనే తెలంగాణ సస్యశ్యామలం అవుతోందని గోబెల్స్ ప్రచారం చేయడం సబబేనా?  ఎస్సారెస్పీ ఫేజ్-1, నిజాం సాగర్ నుంచి వస్తున్న నీళ్లను కాళేశ్వరం ఖాతాలో వేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి చేసిన ఎస్సారెస్పీ ఫేజ్-2, ఎల్లంపల్లి, వరద కాలువ , దేవాదుల , మిడ్ మానేర్ లాంటి ఎన్నో ప్రాజెక్టులు నీళ్లు ఇస్తుంటే అవి కాళేశ్వరం నుంచి వస్తున్నట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నారు" - వైఎస్ షర్మిల 


మూడేళ్లకే మునిగిపోయింది 


వైయస్ఆర్ 38 వేల కోట్లతో అంబేడ్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ చేయాలని సుమారు ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టి కాలువల పనులు సుమారుగా పూర్తి చేశారని వైఎస్ షర్మిల అన్నారు.  అదే ప్లాన్ తో ప్రాజెక్టును కొనసాగిస్తే తక్కువ ఖర్చుతోనే 16 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవని, అలా కాకుండా ప్రాజెక్ట్ ఖర్చు మూడింతలు పెంచి మెగా సంస్థ తో సంబంధాలు ఉన్నాయి కాబట్టి కమీషన్ల కోసం రీడిజైనింగ్ చేశారని ఆరోపించారు. 80 వేల కోట్లకు రీడిజైనింగ్ చేశామన్నారని, రూ.లక్షా 20 వేల కోట్లకు ఎందుకు పెరిగిందని షర్మిల ప్రశ్నించారు. కాంట్రాక్టులు ఎలా ఇచ్చారనేది చూస్తే అన్నీ అవకతవకలే కనిపిస్తున్నాయన్నారు.  బెల్ నుంచి 16 వందల కోట్లకు సామాగ్రి కొంటే 7,500 కోట్లు ఖర్చయినట్లు చూపించారని మండిపడ్డారు.  ఏది కొన్నా నాలుగైదింతలు ఎక్కువ ఖర్చు చూపించారని ఆరోపించారు.  కేసీఆర్ ఈ ప్రాజెక్టు నా రక్తం.. నా మెదడు.. నా చెమట అన్నారని, ఆయనే ఆర్కిటెక్ట్, ఆయనే డిజైనర్..  కేసీఆర్ రీడిజైన్ చేసిన ప్రాజెక్ట్ నాణ్యత లేక మూడేళ్లకే మునిగిపోయిందన్నారు.  పంప్ హౌజ్ ల ఎత్తు కూడా చూసుకోకుండా కట్టారని, నాసిరకం పనులు చేశారని విమర్శించారు. ఇస్తామని చెప్పినన్ని నీళ్లు ఇవ్వకపోగా నీళ్లను ఎత్తిపోయడానికి పవర్ బిల్ అదనంగా రూ.3 వేల కోట్లు ఖర్చయిందన్నారు.  కేసీఆర్ 80 శాతం ప్రాజెక్టును ఒకే మనిషికి ఇస్తుంటే కాంగ్రెస్, బీజేపీలు కేసీఆర్ అవినీతిపై ఎప్పుడైనా మాట్లాడలేదని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి మెగా కృష్ణా రెడ్డి దగ్గర డబ్బు తీసుకొన్నారని ఆరోపించారు. బండి సంజయ్ కూడా డబ్బులు తీసుకున్నారని కాబట్టే మాట్లాడం లేదన్నారు.