YS Sharmila : వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.  ఐపీసీ 353, 333,327 సెక్షన్ల కింద ష‌ర్మిలపై  కేసు న‌మోదు చేశారు పోలీసులు. ప్రగతి భవన్ వద్ద ఆందోళనకు పిలుపునిచ్చిన వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో షర్మిలనే స్వయంగా కారు నడిపి ముందుకెళ్లేందుకు యత్నించారు. అయినా పోలీసులు కారును ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆగ్రహంతో షర్మిల కారులోనే కూర్చిండిపోయారు. పోలీసులు ఆమెను కారుతోపాటు తీసుకెళ్లి ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్ స్టేషన్‌ వద్ద ఉంచారు. సీన్ ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌కు మారాక అక్కడ కూడా హైడ్రామా నడిచింది. కారులో ఉన్న షర్మిల బయటకు వచ్చేందుకు అంగీకరించలేదు. పోలీసులు ఎంతగా రిక్వస్ట్ చేసినా బయటకు వచ్చేందుకు ఒప్పుకోలేదు. దీంతో పోలీసులు బలవంతంగా కారు డోర్‌ తెరిచి ఆమెను బయటకు తీశారు. షర్మిలను కారులో నుంచి బయటకు తీసే క్రమంలో పోలీస్‌స్టేషన్ వద్ద హైడ్రామా నడిచింది. 


షర్మిల అరెస్ట్ 


 వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వరంగల్ జిల్లాలో పాదయాత్ర సందర్భంగా సోమవారం టీఆర్‌ఎస్‌ నేతలు షర్మిల ప్రచార రథం, వాహనాలపై దాడి చేశారు.  ఈ దాడికి నిరసనగా ప్రగతి భవన్‌కు ముట్టడికి వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. ప్రగతి భవన్ కు వస్తున్న షర్మిలను మార్గమధ్యలో పోలీసులు అడ్డుకున్నారు. టీఆర్‌ఎస్‌ నేతల దాడిలో ధ్వంసమైన కారు షర్మిల స్వయంగా డ్రైవ్‌ చేసుకుంటూ సీఎం క్యాంప్‌ ఆఫీస్‌కు బయలుదేరారు. రాజ్‌భవన్‌ రోడ్డులో వైఎస్‌ షర్మిలను ఆమెను అడ్డుకున్న పోలీసులు అరెస్ట్‌ చేశారు. కారులోంచి దిగేందుకు షర్మిల నిరాకరించడంతో.. కారును క్రేన్‌ ద్వారా లిఫ్ట్‌ చేసి ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అనంతరం బలవంతంగా కారు డోరు తెరిచి షర్మిలను కిందకు దించారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య షర్మిలను ఎస్ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల వ్యవహరించిన తీరుపై వైఎస్‌ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ధ్వంసం చేసిన వాహనాన్ని కేసీఆర్‌కు చూపించడానికి వెళ్తుంటే అడ్డుకుంటారా అంటూ మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్న షర్మిలను పరామర్శించేందుకు ఆమె తల్లి విజయమ్మకు అక్కడకు బయలుదేరారు. 


షర్మిల పాదయాత్రకు బ్రేక్ 


సోమవారం వైఎస్సార్టీపీ చీఫ్​ షర్మిల పాదయాత్రపై టీఆర్ఎస్​ కార్యకర్తలు దాడికి దిగారు.  వైఎస్ షర్మిల ప్రచార రథానికి టీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పుపెట్టారు. పాదయాత్ర వాహనాలపై రాళ్లు రువ్వారు.  వైఎస్ షర్మిల ఫ్లెక్సీలు తగలబెట్టిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు... షర్మిల గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజక వర్గం చెన్నరావుపేట మండలం జల్లి గ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్తలు షర్మిల ప్రచార రథానికి నిప్పుపెట్టారు. షర్మిల పాదయాత్రను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు.  రోడ్డుపై షర్మిల ఫ్లెక్సీ లు తగలబెట్టి షర్మిల గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.  షర్మిల పాదయాత్ర చేసే రోడ్డులోనే ఫ్లెక్సీ లను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు టీఆర్ఎస్ నాయకులు.  శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పి పోలీసులు షర్మిల యాత్రకు అనుమతి నిరాకరించారు. ఆమెను అరెస్ట్ చేసి పోలీస్​ వాహనంలో హైదరాబాద్ తరలించారు. దీంతో ఆదివారం 3,500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న షర్మిల పాదయాత్రకు వరంగల్​ జిల్లా నర్సంపేట నియోజకవర్గం శంకరమ్మ తండా వద్ద బ్రేక్ పడింది.