హైదరాబాద్ తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా షీ టీమ్ లు మహిళలు, పిల్లల భద్రతకు ప్రత్యేక భరోసాగా మారాయని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ. సింధు పేర్కొన్నారు. రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో 'మహిళలు, పిల్లలకు సైబర్ వరల్డ్ పై చైతన్య కార్యక్రమం' అనే అంశంపై శనివారం రాష్ట్రంలోని వివిధ పాఠశాలలోని సైబర్ అంబాసిడర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమమం నిర్వహించింది. మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ స్వాతీ లక్రా, ఐ.జీ. బి.సుమతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి షెట్లర్ పీ.వీ. సింధు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గత రెండేళ్లుగా కోవిడ్ కారణంగా ఇంటర్నెట్ వినియోగంతో పెరిగిందని, దీంతో పాటు సైబర్ నేరాలు కూడా భారీగానే పెరిగాయని పీవీ సింధు అన్నారు. ఇవి ప్రధానంగా మహిళలు, పిల్లలపై అధికమయ్యాయని సింధు అన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు షీ-టీమ్స్ ఉన్నాయనే  భరోసాను ఎలాగైతే కల్పించాయో, సైబర్ మోసాలకు గురైతే వెంటనే తమకు సైబర్ వారియర్లు ఉన్నారనే ధైర్యాన్ని కల్పించాలన్నారు. సైబర్ నేరాల బారిన పడితే  వెంటనే సమీపంలోని పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయాలని అన్నారు. నిరంతర శ్రమ, అభ్యాసం ద్వారానే తనలా ఛాంపియన్ అవుతారని అదేవిధంగా ప్రతీ ఒక్కరు ప్రతీ రోజు ఏదో ఒక వ్యాయామం చేయాలని సూచించారు. వ్యాయామం ద్వారా సరికొత్త శక్తి లభిస్తుందన్నారు. 



నేను బాధితురాలినే..


పిల్లలను తల్లిదండ్రులు నిరంతరం గమనిస్తుండాలని ఏదైనా సమస్యను పిల్లలు ఎదుర్కొంటే వాటిని అర్ధం చేసుకొని అధిగమించేందుకు చైతన్యం కల్పించాలని పీవీ సింధు అన్నారు. సైబర్ బుల్లియింగ్, ట్రోలింగ్ లను తానూ ఎదుర్కొన్నానని సింధు వెల్లడించారు. ఈ సైబర్ బుల్లియింగ్, ట్రోలింగ్ లను ధైర్యంగా ఎదుర్కోవడంతో పాటు వీటిపై పోలీస్ శాఖలోని సైబర్ సెల్ కు ఫిర్యాదు చేయాలని కోరారు. ఇంటర్నెట్ వినియోగం నిత్యజీవనంలో ఒక భాగమైనదని, వీటిలో విద్యాపరమైన, స్ఫూర్తిదాయక, క్రీడా కార్యక్రమాలతోపాటు మానసిక వికాస కార్యక్రమాలను చూడడానికి ప్రాధాన్యత నిచ్చే విధంగా పేరెంట్స్  జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పాఠశాల స్థాయిలో విద్యార్థిని, విద్యార్థులను సైబర్ వారియర్ లుగా తయారు చేయాలని సింధు కోరారు. అడిషనల్ డీజీ స్వాతి లక్రా మాట్లాడుతూ ఆన్లైన్ క్లాసుల నేపథ్యంలో పెరిగిన మొబైల్ వాడకం ద్వారా సైబర్ నేరాలు కూడా పెరిగాయని అన్నారు. ఈ సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి రాష్ట్రంలోని ప్రతీ పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థినులు, ఒక మహిళా ఉపాధ్యాయినికి సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు సైబర్ కాంగ్రెస్ పేరుతొ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో దాదాపు రెండు వేల మంది టీచర్లు, 3500 విద్యార్థినిలకు శిక్షణ  ఇప్పించామని స్వాతి లక్రా వెల్లడించారు.


Also Read: : తెలంగాణలో తగ్గని కోవిడ్ ఉద్ధృతి... కొత్తగా 3,590 కేసులు, ఇద్దరు మృతి