Case On Bandi Sanjay : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌వితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజ‌య్‌పై బీఆర్ఎస్ కార్పొరేట‌ర్ మ‌న్నె క‌వితా రెడ్డి బంజారాహిల్స్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ 354ఏ, 504, 509 సెక్షన్ల కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు. బంజారాహిల్స్ పోలీసు స్టేష‌న్‌తో సహా హైద‌రాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజ‌య్‌పై బీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు, మ‌హిళ‌లు ఫిర్యాదులు చేస్తున్నారు. ఎమ్మెల్సీ క‌విత‌ను కించ‌ప‌రిచేలా మాట్లాడిన సంజ‌య్‌పై క‌ఠిన చ‌ర్యలు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు.  ఇప్పటికే ప‌లు పోలీసు స్టేష‌న్లలో బండి సంజయ్ పై ఎఫ్ఐఆర్‌లు న‌మోదు చేశారు. 


మహిళా కమిషన్ నోటీసులు 


బండి సంజయ్ కు తెలంగాణ రాష్ట్ర  మహిళా కమిషన్ నోటీసులిచ్చింది. ఓ సమావేశంలో కవితపై విమర్శలు చేస్తూ.. అభ్యంతరక వ్యాఖ్యలు చేశారని  బీఆర్ఎస్ తీవ్రంగా మండిపడింది.  ఈ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై  మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. వ్యక్తిగతంగా హాజరు కావాలని మహిళా కమిషన్ ఆదేశించింది.  తెలిపింది. ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ వ్యాఖ్యల్ని మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. విచారణకు కూడా ఆదేశించింది. సంజయ్‌ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ మహిళా ప్రజాప్రతినిధులు జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. 


  విచారణకు హాజరవుతా - బండి సంజయ్ 


 మహిళా కమిషన్ నోటీసులపై బండి సంజయ్‌ స్పందించారు. తనకు ఇంకా మహిళా కమిషన్‌ నుంచి నోటీసులు రాలేదని, నోటీసులు వస్తే తప్పకుండా కమిషన్‌ ఎదుట విచారణకు హాజరవుతానని తెలిపారు. మరోవైపు బీఆర్ఎస్ నేతల ఆందోళనలతో నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. బీజేపీ ఆఫీస్ కు  వచ్చే రెండు మార్గాల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు.  


బండి సంజయ్ ఏమన్నారంటే ?                    


శుక్రవారం ఓ బీజేపీ కార్యక్రమంలో  మాట్లాడిన బండి సంజయ్  సీఎం కూతురు మాత్రమే గొప్ప అన్నట్లు బీఆర్ఎస్ నాయకుల ప్రవర్తన ఉందని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ కేసులకు బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని, తప్పు చేయకుంటే కోర్టు ద్వారా నిరూపించుకుని బయటకు రావాలని ఆయన అన్నారు. ఇంతక ముందే మీడియా వాళ్లు కవితను అరెస్ట్ చేస్తారని ఓ ప్రశ్న అడిగారని, దోషిగా తేలితే అరెస్ట్ చేయక ముద్దు పెట్టుకుంటారా? అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో పెద్ద దుమారం రేగింది. బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. 


రాజ్ భవన్ వద్ద ఉద్రిక్తత 


ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ మహిళా విభాగం అధ్వర్యంలో నిరసనకు పిలుపునిచ్చారు. బండి సంజయ్ పై గవర్నర్ కు ఫిర్యాదు చేయాలని బీఆర్ఎస్ మహిళా నేతలు రాజ్ భవన్ వద్దకు వచ్చారు. దీంతో రాజ్ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్టిల ఆధ్వర్యంలో నిరసన చేశారు. దీంతో రాజ్ భవన్ వద్ద పోలీసులను భారీ మోహరించారు. ఎమ్మెల్సీ కవితకే కాదని, మొత్తం మహిళా లోకానికే బండి సంజయ్‌ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ మహిళా నేతలు డిమాండ్‌ చేశారు. సంజయ్‌ క్షమాపణ చెప్పే వరకు నిరసన కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. చివరికి గవర్నర్  అపాయింట్మెంట్ దొరకక పోవడంతో మేయర్ గద్వాల విజయలక్ష్మి, ప్రభుత్వ విప్ గొంగడి సునీత, డిప్యూటీ మేయర్ శ్రీలత, కార్పొరేటర్లు ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు