PM Modi Tour : జనవరి 19న ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ సోమవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను సందర్శించి, రైల్వే అధికారులతో సమావేశమయ్యారు. ప్రధాని మోదీ రాక సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. వందే భారత్ రైలు ప్రారంభంతోపాటు ఆరోజు ప్రధాని ప్రారంభించనున్న వివిధ కార్యక్రమాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈనెల 19న మొత్తం రూ.2400 కోట్ల వ్యయంతో రైల్వేకు సంబంధించి వివిధ అభివృద్ధి పనులను ప్రధాని మోదీ  ప్రారంభిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు బండి సంజయ్, లక్ష్మణ్ లకు వివరించారు. ప్రధాని రాక సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఏర్పాట్లపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బండి సంజయ్, లక్ష్మణ్ రైల్వే అధికారులతో చర్చించారు. అనంతరం బండి సంజయ్, లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. 


సికింద్రాబాద్- విశాఖ మధ్య వందే భారత్ రైలు 


"తెలంగాణ ప్రయోజనాల విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెద్ద పీట వేస్తున్నారు. ఇప్పటికే రూ.1.04 లక్ష కోట్ల వ్యయంతో తెలంగాణలోని జాతీయ రహదారులను నిర్మాణాన్ని కేంద్రం చేపట్టింది. ఈ విషయంలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానానికి చేరుకుంది. అలాగే రైల్వే లేన్, డబ్లింగ్, ఎంఎంటీఎస్, గేజ్ మార్పిడీ పనులను కేంద్రం పెద్ద ఎత్తున చేపట్టింది. అందులో భాగంగా ఈనెల 19న ప్రధాని రాష్ట్రానికి వస్తున్నారు. సికింద్రాబాద్-విశాఖపట్నం వరకు ‘వందేభారత్’ రైలును జెండా ఊపి లాంఛనంగా ప్రారంభిస్తారు. దీనిద్వారా ప్రయాణీకులకు మూడున్నర గంటల సమయం ఆదా కానుంది. ఈ నేపథ్యంలో రూ.2400 కోట్లతో వివిధ రైల్వే అభివృద్ధి పనులను  ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించబోతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను అంతర్జాతీయ స్థాయిలో ఆధునీకరించడంలో భాగంగా సుమారు రూ.700 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. ఖాజీపేట  ఓరాలింగ్ వర్క్ షాప్ పనులను రిమోట్ ద్వారా ప్రారంభిస్తారు. రూ.1231 కోట్ల వ్యయంతో సికింద్రాబాద్ – మహబూబ్ నగర్ రైల్వే డబ్లింగ్ పనులను ప్రారంభించనున్నారు." - బండి సంజయ్ 


పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభ 


ఇప్పటికే ప్రధానమంత్రి సడక్ యోజన కింద పెద్ద ఎత్తున రోడ్డు నిర్మాణ పనులు చేపడుతూ గ్రామాలను పట్టణాలకు అనుసంధానిస్తున్నారని బండి సంజయ్ తెలిపారు. దీంతోపాటు నదుల అనుసంధాన కార్యక్రమానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారన్నారు. తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా బండి సంజయ్ స్పందిస్తూ... ‘‘నూతన సంవత్సర కానుకగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణలో రైల్వే అభివృద్ధి పనుల కోసం రూ.2400 కోట్లకుపైగా నిధులు ఖర్చు చేయబోతున్నారు. తెలంగాణకు ప్రయోజనాలకు ప్రధాని పెద్ద పీట వేస్తున్నప్పటికీ, అబద్దాలు ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులకు ఈ పర్యటనతోనైనా కనువిప్పు కలగాలని కోరుకుంటున్నాను’’అని వివరించారు. అనంతరం బండి సంజయ్, లక్ష్మణ్ సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ ను సందర్శించారు. ఈనెల 19న ప్రధాని మోదీ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో పరేడ్ మైదానంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.