Mlas Poaching Case : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టులో శుక్రవారం వాదనలు జరిగాయి. సిట్ దర్యాప్తును రద్దు చేసి సీబీఐకి కేసును బదిలీ చేయాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. ఈ కేసును హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులోని ముగ్గురు నిందితులు తరఫున మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ సీతారామమూర్తి, సీనియర్‌ న్యాయవాది ఎల్‌. రవిచంద్ర వాదనలు వినిపించారు. ప్రభుత్వ అప్పీల్‌కు విచారణ అర్హత లేదని వాదించారు. క్రిమినల్‌ కేసు కాబట్టి సింగిల్‌ జడ్జి తీర్పుపై అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలన్నారు. అంతేకానీ హైకోర్టులో డివిజన్ బెంచ్ విచారణ జరపకూడదన్నారు. ఈ కేసు దర్యాప్తును ప్రభుత్వం ప్రభావితం చేసేలా ఉందని అందుకే దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని వాదించారు. కేసు దర్యాప్తులో ధర్మాసనం జోక్యం చేసుకోవద్దని కోరారు. బీజేపీ తరఫున సీనియర్‌ న్యాయవాది దామోదర్‌ రెడ్డి వినిపిస్తూ ఈ కేసును సీబీఐకి అప్పగించడమే సరైన నిర్ణయం అన్నారు.  


రాజకీయ అంశాలకు హైకోర్టు వేదిక కాదు


బీజేపీ లక్ష్యంగా బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నాయని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను కూల్చారని ఆరోపణలు చేస్తున్నారని వాదించారు. ఇలాంటిది దేశంలో ఎక్కడా జరగలేదని నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. తెలంగాణలో మాత్రం 2014 నుంచి ఇప్పటి వరకు 37 మంది ఎమ్మెల్యేలు ఇతర రాజకీయపార్టీల నుంచి బీఆర్ఎస్ లో చేరారని, బీజేపీ తరఫు న్యాయవాది కోర్టు వాదనలు వినిపించారు. బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌ను సింగిల్‌ జడ్జి కొట్టివేసినప్పుడు దానిపై ఎందుకు అప్పీల్‌ చేశారని అడ్వొకేట్ జనరల్ ను హైకోర్టు ప్రశ్నించింది. బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయ అంశాలకు హైకోర్టును వేదికగా చేసుకోవద్దని హితవుపలికింది. రాజకీయ అంశాలను బయట చూసుకోవాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది.


సీబీఐ ఒత్తిడి చేస్తుందని ఏజీ వాదనలు 


 అయితే ప్రభుత్వం తరఫున వాదనలు వినపించే సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దిల్లీలో ఉన్నారని, సోమవారం వరకు గడువు ఇవ్వాలని ఏజీ కోర్టును కోరారు. సోమవారం కూడా ఆయన దిల్లీలో ఉంటారని, ఆన్‌లైన్‌ లో విచారణ జరపాలని ఏజీ కోరడంతో హైకోర్టు అందుకు అంగీకరించింది. సోమవారం మధ్యాహ్నం వర్చువల్‌ విధానంలో ఈ కేసు విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. అయితే ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని సీబీఐ తరఫున సీఎస్‌కు లేఖ రాసినట్టు డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు అందగానే దర్యాప్తు ప్రారంభిస్తామని సీబీఐ తెలిపింది. సీబీఐ అధికారులు కేసు వివరాలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని ఏజీ కోర్టుకు తెలిపారు. సోమవారం వరకు కేసు ఫైల్స్‌ కోసం ఒత్తిడి చేయొద్దని సీబీఐని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసుపై సోమవారం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో స్పష్టత వచ్చిన తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సీబీఐ భావిస్తుంది.