Minister KTR : స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు సాధించిన పురపాలికల ప్రజాప్రతినిధులు, కమిషనర్ల అభినందన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు సాధించిన వారికి అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మరింత ముందుకు సాగాలన్నారు.  దేశంలోనే అత్యధికంగా అవార్డులు సాధించి తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని గుర్తుచేశారు.  ఈ అవార్డులు సాధించేందుకు కింది స్థాయిలో ఉన్న పారిశుద్ధ్య కార్మికురాలి నుంచి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి వరకు అందరూ కలిసి ఒకే రకమైన ఆలోచన విధానంతో పనిచేయడం వల్లనే సాధ్యమైందన్నారు. జాతీయస్థాయిలో ఇంత గొప్ప గుర్తింపు లభించిందన్నారు. 20 ఉత్తమ గ్రామాల్లో 19 తెలంగాణలోనే ఉన్నాయని కేంద్రం చెబుతుందన్న కేటీఆర్... పట్టణాలకు అవార్డులు ప్రకటిస్తే దేశంలో రెండో స్థానంలో తెలంగాణలో నిలిచిందన్నారు. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోకెల్లా అత్యుత్తమమైన రాష్ట్రం తెలంగాణ అని కేంద్రమే చెబుతుందన్నారు. కానీ ఇక్కడ పరిపాలన సరిగా లేదని అబద్దాలను చెబుతుంది కూడా కేంద్రంలోని నాయకులే అన్నారు. అయితే ఇలాంటి అర్థరహిత విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్ తెలిపారు. 






పురపాలికలకు రూ.2 కోట్ల చొప్పున ప్రోత్సాహకం 


"ఒకవైపు అవార్డులు, రివార్డులతో పాటు ప్రజల ప్రశంసలు వస్తున్నాయి. తెలంగాణలో స్థానిక సంస్థల విధులను నిర్ణయించడం, నిధులు మంజూరు చేయడం వల్లనే ఇంత ప్రగతి సాధ్యమైంది. ప్రతి గ్రామంలో, మునిసిపాలిటీలో నర్సరీ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గర్వంగా చెప్పవచ్చు. ఈ రోజు తెలంగాణలోని పట్టణాలు, గ్రామాలు గొప్పగా మారాయి. స్థానిక సంస్థలు 50% రిజర్వేషన్ వల్ల ఎంతో మంది మహిళా నాయకులు పురపాలికలకు నాయకత్వం వహిస్తున్నారు. అద్భుతంగా పురోగతి సాధిస్తున్న గ్రామాలు, పట్టణాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉన్నది. జాతీయస్థాయిలో స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు సాధించిన 19 పురపాలికలకు రెండు కోట్ల చొప్పున ప్రోత్సాహకం అందిస్తున్నాం. ఈ నిధులను ప్రత్యేకంగా పారిశుద్ధ్యం కోసం వినియోగించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అవార్డులు సాధించిన ఈ 19 పురపాలికలకు చెందిన ఛైర్ పర్సన్లు, కమిషనర్లను అడిషనల్ కలెక్టర్లను స్టడీ టూర్ కి పంపించి, మరిన్ని ఉత్తమ పద్ధతులపై అధ్యయనం చేసేందుకు అవకాశం కల్పిస్తాం. ఇందులోంచి పదిమందిని ఎంపిక చేసి జపాన్, సింగపూర్ లో అధ్యయనానికి పంపిస్తాం." - మంత్రి కేటీఆర్ 


వార్డు ఆఫీసర్ల నియామకం 


పట్టణాలను ప్రజలు మాది అని భావించినప్పుడే అవి అద్భుతంగా అభివృద్ధి సాధిస్తాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆ దిశగా ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ప్రతి పురపాలికల్లో  వెజ్ అండ్ నాన్ వెజ్ మోడల్ మార్కెట్లు, వైకుంఠ ధామం, డంప్ యార్డ్ ల బయో మైనింగ్, మాస్టర్ ప్లాన్, మోడర్న్ దోభి ఘాట్, tsbpaas, మానవ వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంట్లు, గ్రీన్ బడ్జెట్ వంటి 10 లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. పారిశుద్ధ్యం సరిగ్గా అమలుచేస్తే అవార్డులు అవే వెతుకుంటువస్తాయన్నారు. ఎక్కడా కూడా పారిశుద్ధ కార్మికులకు రూ.12 వేలకు తక్కువ జీతం తగ్గకూడదన్నారు. వార్డు ఆఫీసర్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. 3700 వార్డు ఆఫీసర్ల నియామకం చేస్తున్నామన్నారు. ఖాళీలు లేకుండా మునిసిపల్ సిబ్బంది నియామకం చేస్తున్నామని తెలిపారు.


ఎన్జీటీ తీర్పుపై స్పందిస్తూ  


గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుపై స్పందించిన మంత్రి కేటీఆర్... రాష్ట్రం చేస్తున్న పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాల పైన మరింత సమగ్రంగా సమాచారం అందిస్తామన్నారు. ట్రైబ్యునల్ కు కొంత సమాచార గ్యాప్ ఉన్నట్టు ఉందన్నారు. మానవ వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంట్లను అన్నీ పురపాలికల్లో ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. దీంతో అనేక పురపాలికలకు ODF++ rank దక్కాయన్నారు. ప్రతీ యేటా ink@wash అనే ప్రోగ్రాం చేస్తున్నామని తెలిపారు. తద్వారా స్టార్ట్ ఆప్ లకు సపోర్ట్ చేస్తున్నామన్నారు. పురపాలక శాఖ గ్లామర్ డిపార్ట్మెంట్ కాదన్న కేటీఆర్ ఎంత పని చేసినా ప్రజల నుంచి ప్రశంసలు దక్కడం సవాలే అన్నారు.  దేశంలో ఎక్కడ లేని విధంగా స్థానిక సంస్థల కోసం అదనపు కలెక్టర్ వ్యవస్థ తెలంగాణలో ఉందన్నారు.