Mla Rohith Reddy : హైదరాబాద్ లో ఈడీ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హాజరయ్యారు. రోహిత్ రెడ్డి ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఆరా తీస్తుంది. విచారణకు హాజరయ్యేందుకు రోహిత్ రెడ్డి గడువు అడగగా అందుకు ఈడీ అధికారులు తిరస్కరించారు. దీంతో సోమవారం మధ్యాహ్నం రోహిత్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. అంతకు ముందు విచారణకు గడువు కావాలని కోరుతూ తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈడీకి లేఖ రాశారు. రోహిత్ రెడ్డి అభ్యర్థనను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తిరస్కరించింది. రోహిత్‌ రెడ్డి లేఖను తిరస్కరించిన ఈడీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కచ్చితంగా విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. దీంతో ఈడీ విచారణకు హాజరైనట్లు చెప్పారు ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి. ఏ కేసులో తనను విచారణకు పిలిచారో తెలియదన్నారు. చట్టాన్ని గౌరవిస్తానని,అందుకే విచారణకు హాజరయ్యానని రోహిత్ రెడ్డి చెప్పారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. 


రోహిత్ రెడ్డి అభ్యర్థనను తిరస్కరించిన ఈడీ 


అయ్యప్ప దీక్షలో ఉన్నందున విచారణకు సమయం ఇవ్వాలని ఈడీని కోరారని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని, విచారణకు పూర్తిగా సహకరిస్తానన్నారు. కచ్చితంగా హాజరుకావాలని ఈడీ చెప్పడంతో వచ్చానన్నారు. ఏ కేసులో విచారణకు పిలిచారో తనకు తెలియదని ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో కీలక వ్యక్తిగా ఉన్న  ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డికి ఈడీ శుక్రవారం నోటీసులు జారీ చేసింది. సోమవారం విచారణ కోసం తమ కార్యాలయానికి రావాలని కోరింది. మనీల్యాండరింగ్‌ నియంత్రణ చట్టంలోని పలు సెక్షన్ల కింద జారీ చేసిన ఈ నోటీసుల్లో మొత్తం పది అంశాలను ఈడీ ప్రస్తావించింది.  


ఈడీ నోటీసులు 


బెంగళూరు డ్రగ్స్ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని ఈడీ విచారణ పిలిచినట్లు తెలుస్తోంది. అంతకు ముందు విచారణకు హాజరు కాలేనని సమయం కావాలని రోహిత్ రెడ్డి లేఖ రాశారు. ఈ నెల 25 వరకూ తనకు సమయం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఆయన లాయర్ తో ఈడీకి రోహిత్ రెడ్డి లేఖ పంపించారు. ఈడీ అధికారులు అడిగిన మేరకు బ్యాంకు అకౌంట్ స్టేట్‌మెంట్స్, ఇతర డాక్యుమెంట్లు తీసుకోలేకపోయానని రోహిత్ రెడ్డి తెలిపారు. ఇటీవల వరుసగా బ్యాంకు సెలవులు ఉన్న కారణంగా బ్యాంకు స్టేట్మెంట్స్ తీసుకోలేదని లేఖలో ప్రస్తావించారు. గత శుక్రవారం నాడు రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు అందిన సంగతి తెలిసిందే. అయితే, రోహిత్ రెడ్డి తాజాగా చేసిన వినతిని ఈడీ అధికారులు తిరస్కరించారు.


సీఎం కేసీఆర్ తో భేటీ 


సోమవారం రోహిత్ రెడ్డి ప్రగతి భవన్‌కు చేరుకొని సీఎం కేసీఆర్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ప్రగతి భవన్‌లో సీఎం, పైలెట్ రోహిత్ రెడ్డి భేటీ చాలా సేపు జరిగింది. సీఎం కేసీఆర్, న్యాయ నిపుణులతో పైలెట్ రోహిత్ రెడ్డి చర్చించినట్లుగా తెలుస్తోంది. ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చి తనకు సమయం కావాలని ప్రకటన చేశారు. ఇప్పటికే తమకు గడువు కావాలంటూ ఈడీ కార్యాలయానికి పైలెట్ రోహిత్ రెడ్డి పీఏ శ్రవణ్ కుమార్ లేఖ పంపించారు. అయితే, పైలెట్ రోహిత్ రెడ్డి అడిగిన గడువును ఈడీ తిరస్కరించింది.