BJP TRS Flexi Fight :హైదరాబాద్ లో బీజేపీ-టీఆర్ఎస్ మధ్య ఫ్లెక్సీల వార్ నడుస్తోంది. ఇటీవల బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ ను ఉద్దేశిస్తూ సాలు దొర, సెలవు దొర అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో టీఆర్ఎస్ నేతలు అప్పట్లోనే కౌంటర్ ఇచ్చారు. అయితే జులై 3న ప్రధాని మోదీ హైదరాబాద్ రానున్నారు. అలాగే జులై 2న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీను ఉద్దేశిస్తూ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ చుట్టూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు టీఆర్ఎస్ కార్యకర్తలు. సాలు మోదీ, సంపకు మోదీ అంటూ ఫ్లెక్సీలుపై రాశారు. హైదరాబాద్ లో పలు చోట్ల ఈ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. దీంతో బీజేపీ నేతలు మండిపడుతున్నారు. 






ముదిరిన ఫ్లెక్సీల వివాదం 


బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వేళ మళ్లీ ఫ్లెక్సీ వివాదం నడుస్తోంది. సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా ఇటీవల బీజేపీ భారీ ఎల్ఈడీ స్క్రీన్లు పెట్టి సాలు దొర, సెలవు దొర అంటూ ప్రచారం చేసింది. బీజేపీకి కౌంటర్ గా టీఆర్ఎస్ సాలు మోదీ, సంపకు మోదీ, బై బై మోదీ పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. ఫ్లెక్సీల వివాదంలో మాటల యుద్ధం కూడా జోరుగా సాగుతోంది. అయితే కంటోన్మెంట్ లో ప్రధానికి వ్యతిరేకంగా పెట్టిన ఫ్లెక్సీలను అధికారులు తొలగించారు. మరోవైపు సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా పెట్టిన ఎల్ఈడీ  స్క్రీన్లకు జీహెచ్ఎంసీ ఫైన్ వేసింది. 


చెన్నూర్ లో ఫ్లెక్సీలు


ప్రధాని మోదీని అవమానపరిచే విధంగా మంచిర్యాల జిల్లా  మందమర్రి, చెన్నూర్‌ పట్టణాల్లో పెట్టిన ఫ్లెక్సీలను బీజేపీ నాయకులు తొలగించారు. సీఎం కేసీఆర్ కు బీజేపీ భయం పట్టుకుందని ఆరోపణలు చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతుందని సహనం కోల్పోయి టీఆర్ఎస్ నేతలు వికృత చేష్టలకు పాల్పడుతున్నారని, వీటిని ప్రజలు గమనిస్తున్నారని బీజేపీ నేతలు అన్నారు. జులై 3న 10 లక్షల మందితో సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభను విజయవంతం చేస్తామన్నారు. రాష్ట్రం మొత్తం కాషాయమయం చేస్తామని బీజేపీ నాయకులు తెలిపారు.