FarmHouse Case No CBI: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులను సీబీఐకి ఇవ్వాలంటూ బీజేపీ నేత గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తోసి పుచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం .. సిట్ ద్వారానే విచారణ కొనసాగించాలని ఆదేశించింది. సిట్‌కు నేతృత్వం వహిస్తున్న సీవీ ఆనంద్ పారదర్శకంగా దర్యాప్తు  చేయాలని హైకోర్టు సూచించింది.   సిట్ తన దర్యాప్తు నివేదికను ఈ నెల 29లోపు సీల్డ్ కవర్‌లో ట్రయల్ కోర్టు ముందు ఉంచాలని హైకోర్టు సిట్‌కు నిదాశానిర్దేశించింది. అదే సమయంలో  దర్యాప్తు బృందం మీడియాకు కానీ.. ప్రభుత్వానికి కానీ ఎలాంటి వివరాలు లీక్ చేయకూడదని చీఫ్ జస్టిస్ ధర్మానసం షరతులు విధఇంచింది. ఈ కేసులో దర్యాప్తు విషయంలో గోప్యత పాటించడం.. సిట్ చీఫ్ సీవీ ఆనంద్ బాధ్యత అని హైకోర్టు తెలిపింది. ఈ కేసు విషయంలో  సిట్ ఎలాంటి రాజకీయ, ప్రభుత్వ అధారిటీకి రిపోర్ట్ చేయకూడదని.. లఅదే సమయంలో నివేదికను సీల్డ్ కవర్‌లో ట్రయల్ కోర్టుకు సబ్‌మిట్ చేయాలని స్పష్టం చేసింది. 


మొయినాబాద్‌లోని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్‌ హౌస్‌లో   టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలుచేసేందుకు ప్రయత్నించారని రామచంద్రభారతి, కోరె నందకుమార్‌, సింహయాజిలపై కేసులు నమోదు చేశారు.  ఈ కేసు విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు.  సిట్‌కు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వం వహిస్తారు. సభ్యులుగా న‌ల్ల‌గొండ ఎస్పీ రెమా రాజేశ్వ‌రి, సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ క‌మ‌లేశ్వ‌ర్ సింగేన‌వ‌ర్‌, శంషాబాద్ డీసీపీ ఆర్ జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, నారాయ‌ణ‌పేట ఎస్పీ వెంక‌టేశ్వ‌ర్లు, రాజేంద్ర‌న‌గ‌ర్ డివిజన్ ఏసీపీ గంగాధ‌ర్, మొయినాబాద్ ఎస్‌హెచ్‌వో లక్ష్మీరెడ్డిని నియమించారు.  వారు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు. మరోసారి కస్టడీకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 


ఈ కేసు విషయంలో సిట్ చురుగ్గా వ్యవహరిస్తోంది.  సిట్ అధికారులు 7 బృందాలుగా విడిపోయి ఐదు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు.   ఏపీ, హర్యానా, కేరళ, కర్ణాటకతోపాటు హైదరాబాదులోనూ సోదాలు చేశారు.  ఇప్పటికే హైదరాబాద్ లోని నందకుమార్ ఇల్లు, హోటల్లో సోదాలు చేశారు. హర్యానాలోని రామచంద్ర భారతి నివాసంతో పాటు కర్ణాటకలో ఆయనకు సంబంధించిన వారి ఇంట్లోనూ తనిఖీలు చేశారు.  తిరుపతిలో సింహయాజి స్వామీజీకి చెందిన ఆశ్రమంలో సోదాలు జరుగుతున్నాయి. కేరళలోని కొచ్చిలో ఉండే ఓ డాక్టర్ రామచంద్ర భారతికి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. డాక్టర్ ఇంట్లో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఓ జాతీయ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధి బంధువు, తిరుపతి నుంచి హైదరాబాద్ కు రావడానికి సింహయాజీ స్వామీజీకి విమానం టికెట్ బుక్ చేసినట్లు గుర్తించారు. సిట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్నారు పోలీసు అధికారులు.  


అయితే ఇక నుంచి ఈ కేసు విషయంలో అప్ డేట్స్ ఏమీ  బయటకు తెలిసే అవకాశం లేదు.  పూర్తి స్థాయిలో సీక్రెట్‌గా ఉంచాలని సిట్‌కు హైకోర్టు దిశానిర్దేశం చేసింది.