Telangana MLC Candidates : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బలమూరి వెంకట్ అద్దంకి దయాకర్ పేర్లను హైకమాండ్ ఖరారు చేసింది. ఈ మేరకు నామినేషన్లు దాఖలు చేయాలని హైకమాండ్ నుంచి వారికి సమాచారం వచ్చింది.  ఎమ్మెల్యే కోటాలో అభ్యర్థులుగా వీరు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.  గురువారమే నామినేషన్లకు చివరి తేదీ ఉంది.  ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సంబంధించి గడువు ముగుస్తుంది. అనేక రకాల ఈక్వేషన్లు, అనేక రకాల వ్యక్తులను పరిగణలోకి తీసుకున్న తర్వాత అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఫైనల్ చేసింది. 


ఉద్యమ నాయకులకు పెద్ద పీట 


అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ తమ ఎమ్మెల్యే సీట్లను త్యాగం చేశారు. అసెంబ్లీ కోఆర్డినేటర్ గా ఉన్నప్పటికీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు.  పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో బల్మూరి వెంకట్ హుజూరాబాద్ ఉప ఎన్నిక నుంచి పోటీ చేశారు. తక్కువ ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత పార్టీ ప్రయోజనాల దృష్ట్యా పోటీ నుంచి తప్పుకోవాలని పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్ ఇద్దరూ పోటీ నుంచి తప్పుకున్నారు. బల్మూరి వెంకట్ విద్యార్థి ఉద్యమం నుంచి ఉన్నారు. అనేక ఉద్యమాలు చేశారు. ఎన్ ఎస్ యూఐ తరపున అనేక విద్యార్థి ఉద్యమాలు నడిపించారు. టీఎస్ పీఎస్ సీలో పేపర్ లీక్, ఇతర అక్రమాలకు సంబంధించి గట్టిగా పోరాటం చేశారు. హైకోర్టును కూడా ఆశ్రయించారు. పార్టీ కోసం కష్టపడి పని చేశారు, జైలుకి కూడా వెళ్లారు.ఇక, అద్దంకి దయాకర్ పార్టీ వాయిస్ ను అనేక వేదికలపై బలంగా వినిపించారు.


ఏకగ్రీవం  కానున్న ఎమ్మెల్సీలు


ఈనెల 29న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.   సంఖ్యాబలం పరంగా చూస్తే కాంగ్రెస్‌కు ఒక ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్‌కు ఇంకో ఎమ్మెల్సీ వస్తుంది. కానీ, ఎన్నికలసంఘం ఈ రెండు స్థానాలకు వేర్వేరుగా నోటిఫికేషన్లు, వేర్వేరుగా పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీంతో కాంగ్రెస్‌ పార్టీకే రెండు ఎమ్మెల్సీ స్థానాలు దక్కనున్నాయి. ఒక అభ్యర్థికి కనీసం 59.5 ఓట్లు లభిస్తే ఆ అభ్యర్థిదే గెలుపు. అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీకి 64 మంది సభ్యుల బలం ఉంది. ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల ప్రకారం 2 స్థానాలకు వేర్వేరుగా 119 మంది సభ్యులు రెండుసార్లు ఓట్లు వేయాల్సి ఉంటుంది. అంటే మెజారిటీ ఉన్న కాంగ్రెస్ సభ్యులు రెండుసార్లు ఓటేస్తారు. అలా రెండు స్థానాలూ కాంగ్రెస్‌కే దక్కుతాయి. బీఆర్ఎస్ పోటీ పెట్టే అవకాశం లేదు. ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఎమ్మెల్సీలుగా వీరిద్దరికీ 30 నవంబర్‌ 2027 వరకు గడువు ఉన్నా.. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవడంతో ఇద్దరూ గతనెల 9న తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు.  


గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పేర్లూ ఖరారు ?


గవర్నర్ కోటాలో రెండు స్థానాలను ఖరారు చేయాల్సి ఉంది. వీటిని కోదండరాం, జర్నలిస్ట్ అమీర్ అలీ ఖాన్‌ల పేర్లు ఖారరు చేసినట్లుగా తెలుస్తోంది. వీరి పేర్లు కేబినెట్ లో ఆమోదించిన తర్వాత గవర్నర్ కు పంపుతారు. అందు వల్ల కాంగ్రెస్ హైకమాండ్ అధికారిక  ప్రకటన చేయదని చెబుతున్నారు.