Rains In Telangana: నైరుతి రుతుపవనాలు, అల్పపీడన ద్రోణి బలపడటంతో ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో జూలై 27 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ అలర్ట్ జారీ చేయగా, కొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ సైతం జారీ చేశారు. బలపడిన రుతుపవన ద్రోణి ఇప్పుడు గంగానగర్, రోహ్‌తక్ , గ్వాలియర్, సిధి, అంబికాపూర్, సంబల్పూర్, బాలాసోర్, ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ప్రయాణిస్తోంది. 


అల్పపీడన ద్రోణి సగటు సముద్ర మట్టంపై 0.9 కి.మీ వరకు విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు జార్ఖండ్, పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు ఉత్తర ఒడిశా, పరిసర ప్రాంతాలపై ఉండగా.. సగటు సముద్ర మట్టంపై 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉంది. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో రానున్న మూడు నుంచి 5 రోజులు పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.






ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో నేటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు యానాంలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్ష సూచన ఉంది. ఈ 3 జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమరావతి వాతావరణ కేంద్రం సూచించింది.  తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయి.


దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో నేటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు పడతాయి. కేవలం ఒకట్రెండు చోట్ల మాత్రం ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనూ మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఈ మూడు రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా వుండాలని ప్రజలకు అధికారులు సూచించారు.


హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.






తెలంగాణలో భారీ వర్షాలు
తెలంగాణలో మరో 5 రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం .. మహబూబాబాద్, జనగామ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, నల్గొండ, రంగారెడ్డి, మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో మిగతా జిల్లాలైన కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంట గద్వాల్ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ సైతం జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ప్రజలు అత్యవసరమైతే తప్ప, ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అధికారులు హెచ్చరించారు.