Rains In Telangana: ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది తీవ్ర అల్పపీడనంగా మారుతోంది. దాంతో ఏపీ, తెలంగాణతో పాటు యానాంలో వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఆదివారం సైతం భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ సైతం జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించారు.
తెలంగాణలో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో శనివారం వర్షాలు కురిశాయి. ఆదివారం పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగస్టు 17 వరకు రాష్ట్రానికి వర్ష సూచన ఉంది. ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో కొన్నిచోట్ల మరో 3 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్ష సూచనతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ లో నైరుతి దిశ నుంచి గాలులు గంటకు 8 నుంచి 12 కి.మీ వేగంతో వీచనున్నాయి.






ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, పిడుగులు సైతం పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తీరంలో గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. మత్స్యకారులు వేటకు వెళ్లడం అంత క్షేమదాయకం కాదని అధికారులు హెచ్చరించారు. 






దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మరో 3 రోజులపాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో ఆదివారం నుంచి మరో మూడు రోజులు ఓ మోస్తరు వానలు పడతాయి. రైతులకు ఈ వర్షాలు మేలు చేయనున్నాయి. రాయలసీమలోని ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలలో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడతాయి.  
హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.