Heavy Rains in AP Telangana: పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతం నుంచి ఏపీ తీరం వైపు బలమైన గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో నేడు ఏపీలోని కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనుండగా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాల కారణంగా ఏపీలోని 26 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్లు, 7.6 కిలోమీటర్ల ఎత్తులో దక్షిణం వైపు కొనసాగుతోంది. 
రెండు రోజుల్లో అల్పపీడనం..
మరో రెండు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయువ్య దాని పరిసర ప్రాంతాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆగస్టు 7న అల్పపీడనం ఏర్పడనుంది. తెలంగాణలోనూ మరో నాలుగైదు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. 
తెలంగాణలో భారీ వర్షాలు  (Rains in Telangana) 
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో భారీ కురుస్తాయని ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల్ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షం కురవనుందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. 






మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగామ, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని తెలిపారు. ప్రస్తుత సమాచారం మేరకు రాష్ట్రంలో ఆగస్టు 8 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
తాజాగా ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో కొన్ని చోట్ల నేటి నుంచి మరో మూడు రోజులు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో ఆగస్టు 8 వరకు వర్షాలు కురువనున్నాయి. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష సూచన ఉంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలలో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.  





దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనుండగా, దక్షిణ కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. తీరం వెంట బలమైన గాలులు వీస్తున్నాయి. భారీ వర్ష సూచనలతో ఈ ప్రాంతాలకు ఆగస్టు 7 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలోని ఉమ్మడి వైఎస్సార్ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 



హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.