Southwest Monsoon: వారం రోజులు కురిసిన వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఏపీ, తెలంగాణలో రాజమండ్రి, ధవళేశ్వరం, భద్రాచలం వద్ద గోదావరి గరిష్ట నీటి మట్టాన్ని తాకడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. దక్షిణ కోస్తా ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లోని అల్పపీడనం తాజాగా ఉత్తర కోస్తా ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో అనుబంధ ఉపరితల ఆవర్తనంగా మారింది. అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల పైన విస్తరించి ఉంది. రుతుపవన ద్రోణి ఇప్పుడు బలమైన అల్పపీడన ప్రాంతం కేంద్రం గుండా వెళుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీ, తెలంగాణ, యానాంలో నేడు సైతం వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.


ఈశాన్య అరేబియా సముద్రం మీదుగా, సౌరాష్ట్ర , కచ్, ఉదయపూర్, రైసెస్ తీర ప్రాంతాలు, జబల్ పూర్, పెంద్రా రోడ్, హీరాకుడ్, కోస్తా ఒడిశా మీదుగా అల్పపీడన కేంద్రం, తీర ప్రాంత ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో.. అక్కడి నుంచి ఆగ్రేయంగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి, సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఉత్తర భారత ద్వీపకల్పమైన 19 డిగ్రీ ఉత్తర అక్షాంశం వెంట సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ, 7.6 కి.మీ మధ్య సుమారు 18 డిగ్రీల తూర్పు పశ్చిమ షియర్ జోన్ తక్కువగా గుర్తించారు.






ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో..
అల్పపీడనం బలపడటంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు యానాంలోనూ వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో నేడు పిడుగులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ క్రమంలో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి జల్లులు మాత్రమే పడతాయి. వరద నీటితో గోదావరి ప్రాంతాలు చాలా వరకు నీట మునిగాయి. 


దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోనూ అల్పపీడనం ప్రభావం తక్కువగానే ఉంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయి.  సీమ జిల్లాలైన చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి  వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.. వర్షాలు, వరద ప్రవాహం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 


హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.






తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో కొన్ని జిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినా.. మరికొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టినా ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో వరద కొనసాగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి 70 అడుగుల దిగువకు  చేరుకుందని వాతావరణ శాఖ తెలిపింది. కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగామ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.