Rains In Telangana: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో పలు జిల్లాల్లో నేడు సైతం వర్షాలు కురుస్తాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపిన భారత వాతావరణ కేంద్రం ఆ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వీటి ప్రభావంతో ఏపీలో ఆగస్టు 4 వరకు భారీ వర్షాలు కురవనుడగా, తెలంగాణలో ఆగస్టు 5 వరకు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ద్రోణి సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల, 3.1 కి.మీ ఎత్తు వరకు కొనసాగి బలహీనపడింది. కొన్ని దక్షిణ కోస్తాంధ్రకు ఎలాంటి వర్ష హెచ్చరికలు లేవు.


తెలంగాణలో భారీ వర్షాలు 
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో ఆగస్టు 5 వరకు వర్ష సూచన ఉంది. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని, ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. హైదరాబాద్‌లో తూర్పు, ఈశాన్య దిశల నుంచి గంటకు 6 నుంచి 12 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. నాగర్ కర్నూల్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, జనగామ, మహబూబ్ నగర్, మహబూబాబాద్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి, ఖమ్మం, వికారాబాద్ జిల్లాల్లో మరికొన్ని గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని అప్రమత్తం చేస్తూ ఎల్లో అలర్ట్ జారీ చేశారు.  మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని తెలిపారు. భారీ వర్షాల సమయంలో వాగులు, వంకల ప్రవాహాన్ని దాటేందుకు ప్రయత్నించకూడదని ప్రజలను అధికారులు హెచ్చరించారు.






ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఉపరితల ఆవర్తనం ప్రభావం ఉత్తర కోస్తాంధ్ర, యానాంపై అధిక ప్రభావం చూపుతోంది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో ఆగస్టు 4 వరకు భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ సైతం జారీ చేసింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలలో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. 






దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్రలో ఎలాంటి వర్ష హెచ్చరికలు జారీ చేయలేదు. అయితే రాయలసీమకు భారీ వర్ష సూచన ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. దక్షిణ కోస్తాంధ్రలోని ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో తేలికపాటి జల్లులు పడతాయి. రాయలసీమలోని ఉమ్మడి కర్నూలు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయని.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేశారు.


హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.