జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన వర్షాల వల్ల నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి భారీగా వరద వచ్చి చేరుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి కోయిల్ సాగర్, భీమా, జూరాల ఎడమ కాలువలకు నీటి విడుదల కొనసాగుతోంది. ఈ సీజన్లో వరద మూడు లక్షల 50 వేల క్యూసెక్కుల మార్కును దాటడం ఇదే మొదటిసారి అంటున్నారు అధికారులు. వరద ప్రవాహాన్ని ఇంకా పెరిగే అవకాశం  వున్నందున నాలుగు లక్షల క్యూసెక్కుల వరద నీరు జూరాలకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. భారీగా  వరదనీరు  వచ్చి జూరాలలో చేరుతుండడంతో అధికారులు 41 గేట్లను పైకెత్తి మూడు లక్షల 80 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈసీజన్లో ఇప్పటికే  జూరాలకు సంబంధించి వరద 100 టీఎంసీలు క్రాస్ అయ్యింది.




జూరాల ప్రాజెక్టు ఆదివారం మధ్యాహ్నానికి


నీటిమట్టం : 316.550 మీటర్లు 


నీటి నిల్వ : 6.019 టీఎంసీలు


పూర్తిస్థాయి నీటిమట్టం : 318.516 మీటర్లు 


పూర్తి స్థాయి నీటి సామర్థ్యం : 9.657 టీఎంసీలు


ఇన్ ఫ్లో : 3,75,000 క్యూసెక్కులు


దిగువకు శ్రీశైలం వైపు నీటి విడుదల : 3,75,027 క్యూసెక్కులు


మొత్తం ఔట్ ఫ్లో : 3,76,918 క్యూసెక్కులు.




వరద ప్రవాహం అధికంగా వుండటంతో జూరాల నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేసారు. ఆయా గ్రామాల్లో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ తగు చర్యలు చేపట్టారు. ధరూర్ మండలం లోని రేకులపల్లి నుంచి ఇటిక్యాల మండలం లోని బీచుపల్లి వరకు నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉంచేలా  ఆయా శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్లు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. వరద మరింత పెరిగే అవకాశం ఉండటంతో కొన్ని గ్రామాలకు సంబంధించి నదీ పరివాహక ప్రాంతంలో పంటలు నీటమునిగి పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు..




కృష్ణా నదికి భీమా  కూడా తోడవడంతో వరద వేగంగా పెరుగుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాల రెవిన్యూ మరియు పోలీసు అధికారులు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్తగా పవర్ బోట్లను సిద్ధం చేసుకుంటున్నారు. జూరాల ప్రాజెక్టు వద్ద వరద ఉధృతి పెరిగిన క్రమంలో ఎగువ మరియు దిగువ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు నిన్న సాయంత్రం విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియను నిలిపివేశారు. ప్రాజెక్టుకు  వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఆశించిన మేరకు విద్యుత్తు ఉత్పత్తి  చేయలేదని అధికారులు చెపుతున్నారు. వరద ఉధృతి అనుగుణంగా ఉదయం నుంచి ఒక్కొక్క యూనిట్లో విద్యుదుత్పత్తిని నిలిపేస్తూ వచ్చారు ఎగువ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ద్వారా 52.395 దిగువ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 57.517 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయినట్లు జెన్కో అధికారులు చెపుతున్నారు. ప్రాజెక్టు వద్ద వరద ఉధృతి తగ్గుదల సమయంలో తిరిగి జలవిద్యుత్ ఉత్పత్తికి చర్యలుతీసుకుంటామని చెబుతున్నారు. దాదాపు పది రోజుల వ్యవధిలో 68 టియంసిల వరద జూరాల ప్రాజెక్టు కు చేరుకుంది....