Harish Rao :   మెదక్ సహా ఇతర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ప్రైవేటుపరం చేయొద్దని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశ భద్రత, 74 వేల మంది ఉద్యోగులను దృష్టిలో ఉంచుకొని వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. డిఫెన్స్ రంగంలో ఉన్న ఏడు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం ద్వారా ఆయా సంస్థల మధ్య పోటీ నెలకొంటుంది. దీంతో నూతన ఆయుధాల అభివృద్ధి నిలిచిపోతుంది. ఇది మేకిన్ ఇండియా స్ఫూర్తిని దెబ్బతీస్తుందన్నారు.


ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగులకు పని లేకుండా చేస్తున్నారని హరీష్ రావు ఆరోపణ                                         


మెదక్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి, సిబ్బందికి గత ఆర్థిక సంవత్సరంలో కావాల్సినంత పని ఉండేది. దాదాపు రూ.930 కోట్ల ఆర్డర్లను సమయానికి పూర్తి చేశారు. సంస్థ సిబ్బంది ఎలాంటి సవాళ్లనైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంస్థకు పెద్దగా పని అప్పగించలేదు. దీనిని సాకుగా చూపి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని “సిక్ ఇండస్ట్రీ” గా ప్రకటిస్తారని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే ప్రత్యక్షంగా 2500 మంది ఉద్యోగులు, పరోక్షంగా 5000 మంది ఉపాధి దెబ్బతింటుంది. మొత్తంగా సుమారు 25వేల మంది భవిష్యత్తు అంధకారంలో పడుతుందని హరీశ్ రావు లేఖలో పేర్కొన్నారు. 


ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగులు తనను సంప్రదించారన్న హరీష్ రావు                                                                  


డిఫెన్స్ ఫ్యాక్టరీ  ఉద్యోగుల సమాఖ్య ప్రతినిధులు తన దగ్గరికి వచ్చి ప్రైవేటైజేషన్‌ను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆరు డిమాండ్లను నా ద్వారా మీ ముందు ఉంచుతున్నానని లేఖలో పేర్కొన్నారు.  


1. మూడు రైతు చట్టాల మాదిరిగానే డిఫెన్స్ రంగా సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.
2. పరిశోధనల విభాగాన్ని మరింత పటిష్టం చేయాలి.
3. మిషనరీని ఆధునికరించాలి. ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలి.
4. పరిపాలన, కొనుగోలు విధానాలను సరళీకరించాలి.
5. ఆర్మీ అవసరాలకు అనుగుణంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి ఆర్డర్లు ఇవ్వాలి.
6. ప్రసార భారతిలో మాదిరిగానే ఉద్యోగులకు భద్రత కల్పించాలి.


కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణపై వరుసగా లేఖలు               


ఇటీవల కేంద్ర ప్రభుత్వం .. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తుందనే ఆరోపణలు చేస్తూ..  బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇంతకు ముందు కేటీఆర్ ఇలాంటి లేఖలు రాయగా తాజాగా హరీష్  రావు రాశారు.