Telangana government: బీద రైతుల కడుపుకొట్టి బడా పారిశ్రామిక వేత్తలకు భూములను కారుచౌకగా కట్టబెట్టడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిపోయిందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. తనకు నచ్చిన బడాబాబుల కోసం 2013 భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కుతూ భూములను బలవంతంగా సేకరించే భాద్యతను సీఎం భుజాన వేసుకోవడంతో రైతులపై తరచుగా ప్రైవేటు వ్యక్తులు, పోలీసులు లాఠీలు ప్రయోగిస్తున్నారని ఆరోపించారు.
రైతులపై వరుసగా కేసులు - ప్రశ్నిస్తున్న వారిపై దౌర్జన్యాలు
బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ బౌన్సర్లతో పాటు పోలీసులు కూడా రైతులపై విచక్షణారహితంగా దాడి చేయడం అమానుషమని మండిపడ్డారు. పాలమూరు బిడ్డను అని పదేపదే చెప్పుకునే రేవంత్ రెడ్డి తన జిల్లాలోనే ఘటన జరిగి 24 గంటలు అవుతున్నా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. పోలీసులు 12 గ్రామాల రైతులను కొట్టి, 40 మందిపై కేసులు పెట్టి, 12 మంది రిమాండ్ కి పంపించడం దుర్మార్గమన్నారు. రైతులను కొట్టించిన ఇథనాల్ ఫ్యాక్టరీ యజమానిపై కానీ, బౌన్సర్లపై కానీ ఎందుకు కేసులు పెటలేదో చెప్పాలని రేవంత్ సర్కారుని ప్రశ్నిస్తున్నానన్నారు.
ఫార్మా సిటీ భూములు తిరిగి ఇస్తామనిచెప్పి.. కేసులు
కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయన్నారు. లగచర్లలో ఫార్మా కంపెనీని వ్యతిరేకించిన లంబాడా రైతులకు బేడీలు వేసిన ఘటనపై కేంద్ర మానవ హక్కుల సంఘం, ఎస్సీ, ఎస్టీ కమిషన్ తప్పుపట్టినా బుద్ధి రాలేదని మండిపడ్డారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ లో కూడా ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకించిన రైతులను కొట్టారని.. మీ రియల్ ఎస్టేట్ దందాలు పెంచుకోవడానికి 6 లైన్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్ విషయంలో కూడా రైతులపై కేసులు పెట్టారని మండిపడ్డారు. మేము అధికారంలోకి వస్తే ఫార్మా సిటీ భూములు తిరిగిస్తానని నమ్మబలికి అధికారంలోకి వచ్చి తిరిగి అదే రైతులపై కేసులు పెట్టావని మండిపడ్డారు.
రైతులపై తక్షణం కేసులు ఎత్తివేయాలి !
జహీరాబాద్ న్యాలకల్ రైతులపై విచక్షణారహితంగా దాడి చేసి అక్రమ కేసులు పెట్టించావని.. సూర్యాపేట జిల్లా చిలకలూరు గ్రామం రైతులు రుణమాఫీ కాలేదని ప్రశ్నిస్తే 42 మందిపై కేసులు పెట్టి పోలీస్ జులుం చూపించావని రేవంత్ రెడ్డిపై హరీష్ రావు మండిపడ్డారు. ధాన్యం కోతలను ప్రశ్నించినందుకు నిర్మల్ జిల్లా ఏర్వచింతలో రైతులపై కేసులు పెట్టారన్నారు. ఇంకా ఎన్ని రకాలుగా రైతులను గోసపెడుతావ్ రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. రైతులకు, ప్రజలకు పనికి వచ్చే ఒక్క పని చేయడం లేదు కానీ, పెద్దలకు మాత్రం భూములను కట్టబెడుతావని.. రైతులను కొట్టు కమిషన్లు పట్టు అనే విధంగా సాగుతుంది నీ పాలన అని మండిపడ్డారు. తెలంగాణ రైతు లోకం తిరగబడే రోజు ఎంతో దూరంలో లేదని హెచ్చరించారు. అరెస్ట్ చేసిన పెద్ద ధన్వాడ గ్రామానికి చెందిన 12 మంది రైతులను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.