Harish Rao On Revanth Reddy: మేడిగడ్డకు రిపేర్లు చేయించడం చేతకాపోతే రాజీనామా చేయాలని తాను ప్రమాణ స్వీకారం చేసి రిపేర్లు చేయిస్తానని హరీష్ రావు సీఎం రేవంత్ కు సవాల్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని..  కాంగ్రెస్ బురద రాజకీయాలకు పాల్పడుతున్నదని హరీష్ రావు మండిపడ్డారు.  కాళేశ్వరం సమగ్ర స్వరూపం చాలా మందికి తెలియదు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటి కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టిఎంసీల ఉపయోగం... వీటన్నింటి సమాహారం కాళేశ్వరం. ఒక్క మేడిగడ్డనే  చూపిస్తున్నారని  మండిపడ్డారు. 


కాళేశ్వరం తెలంగాణకు వరదాయిని  


కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మీరెంత తక్కువ చేసి మాట్లాడినా అది ముమ్మాటికి తెలంగాణకు వరదాయిని. తెలంగాణ ప్రజలకు జీవ ధార అని హరీష్ రావు స్పష్టం చేసారు.  లోయర్ మానేరు నుంచి సూర్యపేట దాకా, నిండిన చెరువులు, పండిన పంటలు, భూమిలో పెరిగిన ఊటలు, మోటారు లేకుండనే ఉబికివస్తున్న బోర్ల పంపులు ఇవన్నీ కాళేశ్వరం ఫలాలేనన్నారు.  కూడెల్లి వాగు పొంగిందన్నా, హల్దీ వాగు దుంకిందన్నా, అన్నపూర్ణ రిజర్వాయర్ నిండిందన్నా, రంగనాయక్ సాగర్ నిండిందన్నా, మల్లన్న సాగరం నిండిందన్నా, కొండ పోచమ్మ సాగర్ నిండిందన్నా అది కాళేశ్వరం ప్రసాదించిన ఫలితమేనన్నారు.  పెరిగిన పంటరాశుల్లో ప్రతిబింబించింది కాళేశ్వరమే. ఇవాళేదో రెండు పిల్లర్లు కుంగినయని, తెలంగాణకు ప్రాణాధారమైనజీవాధారను మీరు అవమానిస్తున్నరు. అలక్షంచేస్తున్నరు. రాయకీయ లబ్ధి కోసం మొత్తం ప్రాజెక్టునే డ్యామేజ్ చేయాలనే దుష్ట పన్నాగం పాల్పడుతున్నారని ఆరోపించారు. 


రిపేర్లు చేయించలేకపోతే రాజీనామా చేయండి ! 


కుంగిన పిల్లర్లకు రిపేర్లు చేయించండి పొలాలకు నీళ్లు మళ్లించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.   విచారణలు జరిపించండి. బాధ్యులయిన వారిని నిరభ్యంతరంగా శిక్షించండి. కానీ ప్రజల ప్రయోజనాలకు గండి కొట్టకండి. తెలంగాణ రైతుల నోట్లో మన్ను కొట్టకండని కోరారు.  కడెం వాగు ప్రాజెక్టులు కట్టంగనే కొట్టుకుపోయింది. పునరుద్ధరించారు. సింగూరు డ్యాం, ఎల్లంపల్లి, సాత్నాల ప్రాజెక్టులు కూడా కొట్టుకుపోయాయి. పుట్టగండి ప్రాజెక్టు ప్రారంభించగానే కొట్టుకుపోయింది. కాంగ్రెస్ హయాంలో పంజాగుట్టలో ఫై ఓవర్ కూలి చనిపోయారు. పోలవరం డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది. రాయలసీమలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. ఇలాంటి ఘటనలు జరిగితే కారకులపై శిక్షించి, పునరుద్ధరణ చేసి రైతులకు అన్యాయం జరగకుండా చూస్తారని గుర్తు చేశారు.  


ప్రశంసించిన కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు


కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మొన్ననే కాళేశ్వరం స్టడీ టూర్ వచ్చి, నేర్చుకున్నరు. ప్రశంసించారు. మీరేమో రాజకీయ లబ్ధి కొరకు రేపు డైవర్షన్ టూర్ పెట్టుకున్నరు.  ఇంజినీర్లు నిన్న వాస్తవాలు చెబుతుంటే, వారిని దబాయించి మాట్లాడుతున్నారు. వాస్తవాలు బయటకు చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.  98వేల 570 కత్త ఆయకట్టు అని చూపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కెనాల్స్ ద్వారా 546 చెరువులు నింపి 39వేల ఎకరాలకు నీల్లు అందించాం. కాళేశ్వరం నీళ్లు ఎస్సారెస్పీ నీళ్లకు కలుపడం ద్వారా 2,143 చెరువులు నింపాం. తద్వారా లక్షా 67వేల ఎకరాలు నీళ్లు వచ్చాయి. దింతో పాటు ఇవి కాకుండా 17లక్షల ఎకరాలను స్టెబిలైజ్ చేశాం. మొత్తంగా 20లక్షల 33,572 ఎకరాలకు నీళ్లు అందించాం.   హల్దీ వాగు, కూడవెళ్లి వాగులో 20వేల ఎకరాలకు నీళ్లు అందింది. ఇదేది ఇంజినీర్లు చెప్పకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 


కాళేశ్వరం ద్వారా 20 లక్షల ఎకరాలకు సాగునీరు 


మొత్తం 20 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా ప్రయోజనం అందింది. వాస్తవాలు మరుగున పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాన్నారు.  కాంగ్రెస్ హయాంలో 27వేల ఎకరాలకు మాత్రమే కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇస్తే, మేము అన్ని పనులు పూర్తి చేసి 6 లక్షల 36 వేల 700 ఎకరాలకు నీళ్లు అందించాం. మేము చేసిన పనులు మీరు చేయండి. కాళేశ్వరం కాల్వలు తవ్వండి పూర్తి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వండి. నీళ్లు ఇచ్చామని చెప్పుకోండని సూచించారు.   రీ ఇంజనీరింగ్ వలన ప్రాజెక్టు అంచనా వ్యయం అనివార్యంగా పెరుగుతుంది. ప్రాణహిత చేవెళ్ళ ఆంచనా విలువల 17 వేల కోట్లతో మొదలై 38 వేల కోట్లకు పెరిగి కేంద్ర జల సంఘానికి నివేదించే నాటికి 40 వేల కోట్లకు పెరిగింది. తట్ట మట్టి ఎత్తకుండానే ప్రాజెక్టు అంచనా విలువ 17 వేల కోట్ల నుంచి 40 వేల కోట్లకు ఎందుకు పెరిగినట్టా అని ప్రశ్నించారు.   దయచేసి పునరుద్దరణ చర్యలు చేపట్టండి. విచారణకు మేము సిద్ధం మేము ఎలాంటి తప్పు చేయలేదు. రైతులకు న్యాయం జరిగేలా చూడండి. టెక్నికల్ సమస్య తెలుసుకొని యుద్ధప్రతిపాదికన పనులు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.