భద్రాచలం వద్ద గత నెలలో వచ్చిన వరదలు మర్చిపోక ముందే మరోసారి గోదావరి నది ఉగ్రరూపంతో ప్రవహిస్తూ ఉంది. బుధవారం ఉదయం 5 గంటల సమయానికి గోదావరిలో నీటి మట్టం 54.5 అడుగులకు చేరినట్లుగా అధికారులు తెలిపారు. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నది 14 లక్షల 92 వేల 679 క్యూసెక్కుల వరద ప్రవహిస్తూ ఉంది.


ఈ వరద ప్రభావంతో సమీపంలోని కొన్ని పలు మండలాలు జలదిగ్భందంలోకి వెళ్లాయి. చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏలూరూ ఏజెన్సీలోనూ గోదావరి వరద ఉధృతి పెరిగింది. భద్రా‌చలం నుంచి చర్లకు వెళ్లే ప్రధాన రహ‌దా‌రిపై వరద నీరు పెద్దఎత్తున ప్రవ‌హిం‌చ‌డంతో రాక‌పో‌క‌లు పూర్తిగా ఆగిపోయాయి. భద్రా‌చలం నుంచి ఛత్తీ‌స్‌‌గఢ్‌, ఒడిశా ప్రాంతా‌లకు వెళ్లే‌ప్రధాన రహ‌దా‌రిపై నెల్లి‌పాక వద్ద వరద నీరు చేర‌డంతో రాక‌పో‌కలు పూర్తిగా స్తంభించాయి. కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు కూడా నీట మునిగాయి. గుండేటివాగు కల్వర్టు మునగడంతో గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. 


కృష్ణా నదిలోనూ వరద ప్రవాహం
కృష్ణా నదిలోనూ వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 3.15 లక్షల క్యూసెక్కులుగా ఉంది. వంశధార-నాగావళి నదుల వరద ప్రవాహం పెరిగింది. గొట్టా బ్యారేజ్‌ వద్ద ఔట్‌ఫ్లో 30,712 క్యూసెక్యులుగా ఉంది. అయితే, గత వారంతో పోలిస్తే కాస్త తగ్గడంతో ప్రకాశం బ్యారేజీలో నీటి మట్టం మెల్లగా తగ్గుతోంది. గతకొంతకాలంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో బ్యారేజికి భారీగా వరద నీరు చేరింది. రెండుమూడు రోజులుగా వర్షాలు తగ్గడంతో వరద ప్రవాహం కూడా అతి స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం బ్యారేజీకి 2,85,055 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా 60 గేట్లను 7 అడుగుల మేర ఎత్తి  2,70,100 క్యూసెక్కుల నీటిని కిందకి వదులుతున్నారు. అలాగే మరో 14,955 క్యూసెక్కుల నీటిని ఏలూరు, బందరు కాలువలకు విడుదల చేస్తున్నారు. 


దవళేశ్వరంలో రెండో ప్రమాద హెచ్చరిక


ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుత ఇన్ ఫ్లో 14.20 లక్షల క్యూసెక్కులు ఉండగా... ఔట్ ఫ్లో కూడా అంతే ఉంది. ముంపు గ్రామాల్లోని సహాయక చర్యల్లో భాగంగా మొత్తం 3 ఎస్డీఆర్ఎఫ్, 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో ఎన్డీఆర్ఎఫ్, ఐయినవిల్లి, మామిడి కుదురులో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు  సహాయక చర్యలు కొనసాస్తున్నాయి. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో ఎన్డీఆర్ఎఫ్, విఆర్ పురంలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి. ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో ఎన్డీఆర్ఎఫ్ బృందం చర్యలు అందిస్తోంది. 


ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి..!


కృష్ణా నదికి కూడా వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3.15 లక్షల క్యూసెక్కులుగా ఉండగా.. వంశధార - నాగావళి నదులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. అలాగే గొట్టా బ్యారేజ్ వద్ద ఔట్ ఫ్లో 30,712 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయిలో వరద ప్రవాహం తగ్గే వరకు నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వీలయినంత వరకు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని చెబుతున్నారు. 


ఆదివారం నుంచి జల దిగ్బంధంలోనే గ్రామాలు..


మూడు రోజుల కిందట.. ఆదివారం ఉదయం 6 గంటలకు బ్యారేజీలో నీటిమట్టం 14.90  అడుగులు ఉండగా.. సముద్రంలో14,62,217 క్యూసెక్కుల జలాలు దిగువకు విడుదల చేశారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు నీటి మట్టం 14.80కు చేరుగా.. కడలిలోకి 14,44,414 క్యూసెక్కుల నీటని వదిలారు. దీని వల్ల కోనసీమలోని గౌతమి, వశిష్ఠ, వైనతేయ నదీపాయలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలోన్ని చాలా గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ఈ క్రమంలోనే 3 ఎస్డీఆర్ఎఫ్, 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు.. ప్రస్తుతం సహాయక చర్యలు అందిస్తున్నాయి.