Godavari River Management Board: గోదావరి నదీ యాజమాన్య బోర్డు మీటింగ్...గెజిట్ అమలు, కార్యాచరణపై చర్చ...తెలంగాణ అధికారులు గైర్హాజరు

గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమన్వయ కమిటీ సమావేశం ఇవాళ హైదరాబాద్ లో జరుగుతోంది. కృష్ణా, గోదావరి నదీ బోర్డుల పరిధిపై కేంద్ర జల్ శక్తి శాఖ గెజిట్ విడుదల అనంతరం తొలిసారి గోదావరి బోర్డు సమావేశమవుతోంది.

ABP Desam Last Updated: 03 Aug 2021 04:27 PM
Godavari River Management Board: గురువారం రాయలసీమ ఎత్తిపోతలను పరిశీలించనున్న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రతినిధులు గురువారం రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును పరిశీలించనున్నారు. పోతిరెడ్డిపాడు వద్ద రాయలసీమ ఎత్తిపోతల పనులను బోర్డు బృందం పరిశీలిస్తారు. బృందంలో తెలంగాణకు చెందిన వారెవరూ ఉండకూడదని ఏపీ ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ప్రభుత్వం సమాచారం ఇచ్చింది.  

Godavari River Management Board: అభ్యంతరాలు ఉన్న ప్రాజెక్టుల వివరాలు ఇవ్వలేం : ఏపీ

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమన్వయ కమిటీ సమావేశమైంది. హైదరాబాద్ జలసౌధలో కేఆర్‌ఎంబీ, జీఆర్ఎంబీ సమన్వయ కమిటీ భేటీ జరిగింది. గెజిట్‌ గడువు ప్రకారం ప్రాజెక్టుల వివరాలు ఇవ్వాలని బోర్డులు కోరాయి. ప్రాజెక్టుల స్వరూపం ఇతర వివరాలు ఇవ్వాలన్నాయి. నోటిఫికేషన్‌లో చేర్చిన ప్రాజెక్టులపై అభ్యంతరాలు ఉన్నాయని ఏపీ ఈఎన్ సీ తెలిపింది. అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఈఎన్‌సీ చెప్పింది. అభ్యంతరాలున్న ప్రాజెక్టుల వివరాలు ఇవ్వలేమని తెలిపింది. వివరాలు ఇచ్చి అభ్యంతరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని బోర్డులు ఏపీకి సూచించాయి. తమ ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని ఈఎన్‌సీ తెలిపింది. సమన్వయ కమిటీ సమావేశాలు ఇకపై తరచూ జరుగుతాయని బోర్డులు తెలిపాయి. ఆగస్టు రెండో వారంలో పూర్తి బోర్డు సమావేశాన్ని నిర్వహిస్తామని జీఆర్ఎంబీ తెలిపింది. 

Background

 


తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం నడుస్తోంది. కృష్ణా, గోదావరి జలాల పంపకాలపై మాటాకు మాటకు అనే తీరులో ఇరు రాష్ట్రాల నేతల వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ) సమన్వయ కమిటీ భేటీ ఇవాళ హైదరాబాద్ లో జరుగనుంది. హైదరాబాద్ జలసౌధలో ఈ కమిటీ మొదటి సమావేశం నిర్వహిస్తున్నారు. గెజిట్ నోటిఫికేషన్ అమలు, కార్యాచరణ ఖరారుపై చర్చ జరగనుందని సమాచారం. ఈ సమావేశానికి తెలంగాణ అధికారులు హాజరు అవుతారా అనే విషయంపై సందిగ్ధం నెలకొంది. 


గోదావరి నదీ జలాల యాజమాన్య బోర్డు సమన్వయ కమిటీ ఇవాళ సమావేశం కానుంది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాలకు గోదావరి నది యాజమాన్య బోర్డు లేఖ సైతం రాసింది. ఆగస్టు 3న జరిగే సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన రాష్ట్రాల సభ్యులు హాజరు అవ్వాలని లేఖలో కోరారు. సమావేశం అజెండాతో రావాలని లేఖలో జీఆర్ఎంబీ కోరింది. కృష్ణా, గోదావరి నదీ బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ గెజిట్ విడుదల చేసిన అనంతరం తొలిసారి గోదావరి బోర్డు సమావేశం జరుగుతుంది.


ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చకు వచ్చే అవకాశం ఉంది. నదీ యాజమాన్యపు బోర్డుకు సంబంధించిన గెజిట్ అమలు కార్యాచరణ ఖరారుపై ఈ మీటింగ్ లో చర్చించనున్నారు. ఈ భేటీకి గోదావరి నదీ యాజమాన్యపు బోర్డు సభ్యులు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి, రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్లు, ట్రాన్స్‌కో, జెన్‌కో మేనేజింగ్ డైరక్టర్లు హాజరుకానున్నారు. 


కేంద్ర జల్ శక్తి శాఖ గెజిట్ అక్టోబర్ 14 నుంచి అమల్లోకి రానుండగా, ఈ లోపు చేయాల్సిన కార్యాచరణపై కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డులు కసరత్తు చేస్తున్నాయి. దీని కోసం కో-ఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటుచేశారు. ముందుగా బోర్డు మీటింగ్ నిర్వహించాలని తెలంగాణ తన లేఖలో కోరింది. ఆ లేఖపై స్పందించిన గోదావరి బోర్డు నోటిఫికేషన్ అమలుకు నిర్దిష్ట గడువులో తక్షణ కార్యాచరణ ఖరారు చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయన్నారు. అమలు కార్యాచరణ, గడువులపై సమన్వయ కమిటీలో చర్చించాల్సిన అవసరం ఉందని తెలిపారు. వాటిపై చర్చించి తగు చర్యలు తీసుకున్న తర్వాత బోర్డు పూర్తిస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. 


 తెలంగాణ అధికారులు గైర్హాజరు 


కృష్ణా, గోదావరి బోర్డుల సమన్వయ కమిటీ భేటీ మొదలైంది. ఈ సమావేశంలో ఏపీ నుంచి ఈఎన్‌సీ, ట్రాన్స్‌కో, జెన్‌కో అధికారులు పాల్గొన్నారు. అయితే తెలంగాణకు చెందిన ట్రాన్‌స్కో, జెన్‌కో అధికారులు మాత్రం సమావేశానికి హాజరుకాలేదు. నదీ జలాల విషయంలో కృష్ణా, గోదావరి బోర్డులకు పూర్తిస్థాయి అధికారాలు కేటాయిస్తూ కేంద్రం గెజిట్‌ నోటిషికేషన్‌ జారీ చేసింది. దీనిపై గత నెల 29న గోదావరి బోర్డు సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. మంగళవారం ఈ కమిటీ భేటీ నిర్వహించనున్నట్లు 30న రెండు తెలుగు రాష్ట్రాలకు లేఖ పంపింది. కానీ పూర్తి బోర్డు సమావేశం నిర్వహిస్తేనే హాజరవుతాయని తెలంగాణ నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ మురళీధర్ బోర్డుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. పూర్తి బోర్డు మీటింగ్ పెట్టి గెజిట్ పై కార్యాచరణ నిర్దేశించాలని కోరారు. 


 


Also Read: JC Prabhakar Reddy: తాడిపత్రి రాజకీయం హాట్ హాట్...రాత్రంతా మున్సిపల్ ఆఫీసులో జేసీ ప్రభాకర్ రెడ్డి...అధికారులకు ఒంగి ఒంగి దండాలు

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.