Basara Godavari Floods: నిర్మల్ జిల్లా బాసరలో గోదావరి ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది. బాసర పట్టణంతో పాటు.. భైంసాలోనూ రోడ్లపైకి గోదావరి బ్యాక్ వాటర్ వచ్చింది. పలు ఇళ్లు నీట మునిగాయి. ఓ వైపు భారీ వర్షం.. మరో వైపు పై నుంచి వస్తున్న వరదతో ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. శుక్రవారం ఆమె ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి హరికిరణ్తో కలిసి నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని రావుల్నగర్, ఆటోనగర్ ప్రాంతాలను పరిశీలించారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోరారు. భైంసాలోని గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు ఇన్ఫ్లో అధికంగా రావడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలడం జరుగుతుందని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని తెలిపారు.
ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటారని, ఏవైనా ఇబ్బందులు తలెత్తితే 91005 77132 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన కలెక్టర్, వరదల కారణంగా ఎవరూ ప్రవాహం నీటిలోకి వెళ్లకూడదని హెచ్చరించారు. ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. అనంతరం భైంసా మండలంలోని దేగామ వంతెనను కలెక్టర్, ప్రత్యేక అధికారి పరిశీలించారు. వంతెన పరిసర ప్రాంతాలలో వరద పరిస్థితులను గమనించారు. వరద నీటిప్రమాదం గురించి స్థానికుల్ని అడిగి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అదే విధంగా కుంటాల మండలంలోని అందకూరు బ్రిడ్జి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వరదల వల్ల వంతెనలు, రహదారులు సర్వే చేపట్టడం జరుగుతుందని తెలిపారు. దెబ్బతిన్న చోట త్వరలోనే శాశ్వత మరమ్మత్తులు చేయడం జరుగుతుందని తెలిపారు.
గోదావరికి ఈ స్థాయి వరద చాలా కాలంగా లేదని..నాలుగు దశాబ్దాల తర్వతా గోదావరి ఘాట్లు నీట మునిగాయని స్థానికులు చెబుతున్నారు. గోదావరి శాంతించకపోతే..బాసరతో పాటు భైంసా కూడా నీట మునిగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రజల్ని అప్రమత్తం చేసి లోతట్టు ప్రాంతాల వాసుల్ని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు.