Ganesh Immersion 2025 | హైదరాబాద్: గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) గణేశుడి నిమజ్జనం కోసం భారీ ఏర్పాట్లు చేసింది. పర్యావరణ హితంగా ఈ నిమజ్జన కార్యక్రమం జరిగేందుకు జీహెచ్‌ఎంసీ, పోలీస్, పర్యావరణ శాఖలతో పాటు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. ఆ వివరాలు ఈ కథనంలో ఉన్నాయి.

నిమజ్జన స్థలాలు & క్రేన్లు: 9 ప్రధాన చెరువులు, 72 కృత్రిమ నిమజ్జన స్థలాల వద్ద 134 స్టాటిక్, 269 మొబైల్ క్రేన్లను సిద్ధం చేశారు. హుస్సేన్ సాగర్ పరిసరాల్లోనే 40 క్రేన్లను ఏర్పాటు చేశారు. ఇందులో 11 భారీ క్రేన్లు ఉన్నాయి. తద్వారా పెద్ద విగ్రహాల నిమజ్జనం వేగంగా, సురక్షితంగా జరిగేలా ఏర్పాట్లు చేశారు.

ఊరేగింపు మార్గాలు: వినాయక నిమజ్జనం కోసం భక్తులు గణేశుడి విగ్రహాలను ఊరేగించేందుకు 303.3 కిలోమీటర్ల మార్గాన్ని గుర్తించారు. ఈ మార్గాల్లో 13 కంట్రోల్ రూమ్‌లు, 160 గణేశ్ యాక్షన్ టీమ్‌లు నిమజ్జనాన్ని పర్యవేక్షిస్తాయి. విగ్రహ వాహనాలు వచ్చే మార్గాలను కూడా అధికారులు సిద్ధం చేశారు.

పరిశుభ్రత కార్యక్రమం: నిమజ్జనం తర్వాత పరిశుభ్రత కోసం 14,486 మంది శానిటేషన్ సిబ్బందిని నియమించారు. భక్తుల కోసం 309 మొబైల్ టాయిలెట్లు, 102 మినీ టిప్పర్లు, 125 జేసీబీలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 10,500 మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించి ప్రాసెసింగ్ యూనిట్లకు తరలించారు. చెత్త సేకరణ కోసం 5 లక్షల ట్రాష్ బ్యాగ్స్‌ను కూడా అధికారులు పంపిణీ చేశారు.

మట్టి విగ్రహాల పంపిణీ: పర్యావరణాన్ని కాపాడేందుకు జీహెచ్‌ఎంసీ, టీజీపీసీబీ (తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్) ఆధ్వర్యంలో 2 లక్షల మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు.

భద్రత & లైటింగ్: నిమజ్జన కార్యక్రమం కోసం వచ్చే భక్తుల సౌకర్యార్థం భద్రతా ఏర్పాట్లు, లైటింగ్‌ను కూడా చేపట్టారు. 56,187 తాత్కాలిక లైట్లను ఏర్పాటు చేశారు. 839.42 కిలోమీటర్ల పొడవునా చెట్ల కొమ్మలను తొలగించి, మార్గాల్లో 100 శాతం వెలుగు ఉండేలా చూశారు. నిరంతర పర్యవేక్షణ కోసం సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు.

ఆరోగ్య సదుపాయాలు: భక్తుల కోసం ఏడు మెడికల్ క్యాంపులు, అంబులెన్స్‌లు సిద్ధంగా ఉన్నాయి. అలాగే, పని చేసే వర్కర్లు, క్రేన్ ఆపరేటర్లకు విశ్రాంతి ఏర్పాట్లు కూడా చేశారు.

ఇప్పటికే జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,80,000కు పైగా గణేశ విగ్రహాలు సురక్షితంగా, పర్యావరణహితంగా నిమజ్జనం చేసినట్లు అధికారులు తెలిపారు. జీహెచ్‌ఎంసీ, పోలీస్, హెచ్‌ఎండీఏ, పర్యాటక శాఖలు కలిసి హైదరాబాద్ చరిత్రలోనే అత్యంత సజావుగా, పర్యావరణహితంగా గణేశ్ నిమజ్జనాన్ని నిర్వహిస్తున్నాయి.