Kishan Reddy: గజ్వేల్‌ నియోజకవర్గం సీఎం కేసీఆర్‌ ప్రైవేటు ఆస్తి అనుకుంటున్నారా? అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు నేతలు శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్‌ సమక్షంలో పార్టీలో చేరారు. అనంతరం వారు మాట్లాడుతూ.. శుక్రవారం కామారెడ్డి నుంచి గజ్వేల్‌కు వెళ్తున్న బీజేపీ నేత రమణారెడ్డి, కార్యకర్తలను పోలీసులు అప్రజాస్వామికంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. 


రాబోయే రోజుల్లో బీజేపీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయన్నారు. గత పాలకుల హయాంలో బడుగు, బలహీన వర్గాలు దోపిడీకి గురయ్యాయని, అధికారానికి దూరంగా ఉన్నాయన్నారు. తెలంగాణ సాధించుకున్న తరువాత కూడా న్యాయం జరగలేదన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేస్తామన్నారు. ఆ బాధ్యత బీజేపీ తీసకుంటుందని భరోసా ఇచ్చారు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా సమ న్యాయం చేస్తామన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ రాక ముందే బీఆర్‌ఎస్ ప్రభుత్వం దౌర్జన్యాలకు పాల్పడుతోందని, బీజేపీ నేతలను లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. 


బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో నేతలందరూ అవినీతికి అలవాటు పట్టారని అన్నారు. ప్రతి పనిలో దోచుకో దాచుకో అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు అన్నింటిలో కమీషన్‌లు, వాటాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కమీషన్‌ ప్రభుత్వం అయితే.. బీఆర్‌ఎస్ సర్కార్ వాటాల ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి నేతలు గజ్వేల్‌కు వెళ్తామంటే కేసీఆర్‌కు ఉలుకెందుకని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. గజ్వేల్‌ అభివృద్ధి చెంది ఉంటే, రైతు ఆత్మహత్యలు లేకుండా ఉంటే, కేసీఆర్‌ ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తే భయమెందుకని నిలదీశారు.


గజ్వేలుకు వెళ్లే అధికారం దేశంలో ప్రతి ఒక్కరికి ఉందన్నారు. ఆపే అధికారం కేసీఆర్, బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి లేవన్నారు. నిజాం ఏమైనా కేసీఆర్‌కు గజ్వేలును రాసి ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. అప్రజాస్వామికంగా బీజేపీ నేత వెంకట రమణారెడ్డిని అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న పోలీసులు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. బీజేపీ దేనికైనా తెగింపునకు సిద్ధంగా ఉందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ రైతులను పూర్తిగా విస్మరించారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో రైతుల శక్తి ఏంటో బీఆర్‌ఎస్‌కు చూపిస్తారని ఎద్దేవా చేశారు. 


కేసీఆర్ ప్రకటించిన అనేక పథకాలు ఫెల్యూర్ అయ్యాయన్నారు. రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశారని, అరకొర రైతులకు మాత్రమే మాఫీ చేశారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో రైతుల సత్తా ఏంటో ప్రభుత్వానికి చూపిస్తారని అన్నారు. బీజేపీ నేతలు ప్రతి పనిలో కమీషన్లు, వాటాలు తీసుకుంటున్నారని, కేసీఆర్ కుటుంబానికి వాటాలు అందుతున్నాయన్నారు. బీఆర్ఎస్ ప్రకటించిన ఎమ్మెల్యేలు అభ్యర్థులు అందరూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తెలంగాణను దోచుకున్నారని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులు, ప్రభుత్వ భూములు అమ్ముకున్నారని, ధరణి పేరుతో సన్న, చిన్న కారు రైతులను వేధిస్తున్నారని అన్నారు. ధరణి బాధితులు రోజు బీజీపీ కార్యాలయానికి వస్తున్నారని, న్యాయం చేయాలని వేడకుంటున్నారని అన్నారు. 


బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకులు నిర్వహించబోతున్నట్లు చెప్పారు. అలాగే అదే రోజు తెలంగాణ విమోచన ఉత్సవాలను బీజేపీ ఆద్వర్యంలో గ్రామ గ్రామాన నిర్వహిస్తామన్నారు. నిజాం పాలన నుంచి విముక్తి పొంది 75 ఏళ్లు వస్తున్న సందర్భంగా ప్రత్యేకంగా నిర్వహిస్తామన్నారు.  రజాకార్లను ఎదుర్కొని అమరవీరులైన కుటుంబాల వారిని సన్మానిస్తామన్నారు.