BRS Balka Suman controversy statements:  బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కార్చిచ్చు రాజేస్తున్నాయి. సింగరేణి సంస్థ పరిరక్షణ పేరుతో ఆయన ఇచ్చిన పిలుపు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలను, సింగరేణి భవన్‌ను తగులబెట్టాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సింగరేణి సంస్థ పరిరక్షణ,  బొగ్గు గనుల వేలం అంశంపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన ప్రసంగం తీవ్ర దుమారం రేపుతోంది.   "మిలిటెంట్ తరహాలో దాడులు చేద్దాం, జీఎం ఆఫీసులను మరియు సింగరేణి భవన్‌ను తగలబెట్టండి, అవసరమైతే రైల్వే లైన్లను కూడా కోసి పడేయండి" అంటూ ఆయన అత్యంత వివాదాస్పద పిలుపునిచ్చారు. అంతేకాకుండా, "మీరు తగలబెడితే మళ్ళీ పైసలు కూడా అవే వస్తాయి" అంటూ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడాన్ని సమర్థించేలా మాట్లాడటం  కలకలం రేపుతోంది.   

Continues below advertisement

ప్రభుత్వ ఆస్తులు ప్రజా ధనంతో నిర్మించినవని, రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని ధ్వంసం చేయాలని పిలుపునివ్వడం నేరపూరిత చర్య అని పలువురు అభిప్రాయపడుతున్నారు. సింగరేణి భవన్ లాంటి కీలక కార్యాలయాలపై దాడులకు ప్రోత్సహించడం వల్ల పౌరుల ప్రాణాలకు, ఆస్తులకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉన్నప్పటికీ, అది హింసకు దారితీయకూడదని ఆయనపై పోలీసులు చర్యలు తీసుకోవాలని అంటున్నారు.  

Continues below advertisement

బాల్క సుమన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.   ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రెచ్చగొట్టే ప్రసంగాల ద్వారా అశాంతిని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. గతంలో కూడా బాల్క సుమన్ పలుమార్లు ఘాటు వ్యాఖ్యలు చేసినప్పటికీ, ఈసారి ఏకంగా దాడులకు పిలుపునివ్వడం విమర్శలకు కారణం అవుతోంది.  

పోలీసులు బాల్క సుమన్ వ్యాఖ్యలపై నిశితంగా దృష్టి సారించారు. ఆయన చేసిన వ్యాఖ్యల వీడియోలను పరిశీలించి, తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.