తెలంగాణ ప్రభుత్వం స్కూల్స్ రీ ఓపెనింగ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అన్ని రకాల పాఠశాలలు యథావిధిగా ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే పాఠశాలల్లో కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. సంక్రాంతి సెలవుల తరవాత స్కూల్స్ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ కరోనా మూడో దశ తీవ్రంగా ఉండటంతో ప్రభుత్వం సెలవులు ఇవ్వాలని నిర్ణయించుకుంది. జనవరి 30వ తేదీ వరకూ సెలవులు పొడిగించింది. ఆ గడువు ఆదివారంతో ముగుస్తుంది. ఆ తర్వాత కూడా  స్కూల్స్ తెరుస్తారా లేదా అన్న సందేహం ఏర్పడింది. 


కరోనా కేసులు భారీగానే వెలుగుచూస్తున్నాయి. అయితే ఈ సారి అంత ప్రమాదకరం కాదని ..  అలాగే తగ్గుతున్న సూచనలు కూడా కనిపిస్తూండటంతో స్కూళ్లు తెరవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య శాఖ నివేదిక ఇచ్చింది. ఇప్పటికే ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే  పలు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కారణంగా విధించిన ఆంక్షలను తొలగిస్తున్నాయి.  స్కూళ్లను తెరుస్తున్నాయి. ఈ క్రమంలోనే విద్యా సంస్థల రీ ఓపెన్‌కు తెలంగాణ వైద్య, విద్య శాఖల అధికారులు మొగ్గు చూపారు.  


విద్యా సంస్థల ప్రారంభంపై శుక్రవారం కరోనా పరిస్థితులపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ఆరా తీసింది. ఈ నెల 31 నుండి పాఠశాలలు తెరుస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. స్కూల్స్ తెరుస్తామని ఈ రోజు హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలియచేసే అవకాశం ఉంది. 


ప్రైవేటు స్కూల్స్ నిర్వాహకులు కూడా సెలవులు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. 31 వ తేదీ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూల్స్ తెరుస్తామని చెబుతున్నారు.  బార్లు, సినిమా హాళ్లకు లేని నిబంధనలు ఒక్క స్కూల్స్‌కే ఎందుకు పెడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. వీటన్నింటికీ పరిష్కారంగా .. స్కూళ్లు తెరవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గత రెండేళ్లుగా సరిగ్గా స్కూల్స్, కాలేజీలు నడవ లేదు. విద్యార్థుల్ని పరీక్షలు లేకుండానే పాస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటీవల ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో విద్యార్థులు సగానికిపైగా ఫెయిల్ కావడంతో  వివాదం కూడా ఏర్పడింది. ఈ  క్రమంలో ఆన్ లైన్ క్లాసుల కన్నా ... ప్రత్యక్ష తరగతులే మంచిదని.. తగిన జాగ్రత్తలు తీసుకుంటే  విద్యా ప్రమాణాలు పడిపోకుండా  ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది.