ED Notice To Gangula Family Members: తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు షాక్ ఇచ్చారు. ఫెమా నిబంధనల ఉల్లంఘనకు గానూ ఆయన కుటుంబ సభ్యులకు చెందిన ఏజెన్సీకి ఈడీ నోటీసులు జారీ చేసింది. గంగుల కుటుంబ సభ్యులకు చెందిన శ్వేతా గ్రానెట్స్ ఫెమా నిబంధలు ఉల్లంఘించినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. గత ఏడాది నవంబర్‌లో శ్వేతా ఏజెన్సీస్‌లో సోదాలు నిర్వహించింది కూడా. 


చైనాకు గ్రానైట్స్‌ మెటీరియల్ ఎగుమతి చేయటంలో అక్రమాలు జరిగినట్టు ఈడీ తేల్చింది. ఈ క్రమంలోనే గంగుల కుటుంబ సభ్యులకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే చైనాకు గ్రానైట్ ఎక్స్‌పోర్ట్స్‌లో అవకతవకలు జరిగినట్టుగా నిర్దారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శ్వేతా గ్రానైట్ కంపెనీ ప్రతినిధులు ఈడీ అధికారులు ఎదుట విచారణకు హాజరయ్యారు. 


విజిలెన్స్ రిపోర్టు ప్రకారం 7.6 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ అక్రమంగా తరలించినట్టుగా ఈడీ అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. రూ. 4.8 కోట్ల మేర ఉల్లంఘనలకు పాల్పడినట్టుగా గుర్తించినట్టుగా సమాచారం. హవాలా మార్గంలో డబ్బు ట్రాన్స్‌ఫర్ అయినట్టుగా తేల్చారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులో రూ. 50 కోట్ల వరకు పెండింగ్‌లో ఉండగా.. రూ. 3 కోట్లు మాత్రమే చెల్లించినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు.


గత ఏడాదిలో తనిఖీలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న గ్రానైట్ కంపెనీలకు గత ఏడాది నవంబర్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. టీఆర్‌ఎస్ మంత్రి గ్రానైట్ వ్యాపారంపై రెండేళ్ల క్రితం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఈడీకి ఫిర్యాదు చేశారు. కరీంనగర్‌లో గంగుల మైనింగ్‌ మాఫియాను నడుపుతున్నారని ఆయన ఆరోపించారు. అయితే ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బీజేపీ నేత మహిందర్ రెడ్డి, తెలంగాణ హైకోర్టు న్యాయవాది గంగాధర్ మైనింగ్ మాఫియాపై మరోసారి ఫిర్యాదు చేశారు.


ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న ED చర్యలకు దిగింది. కరీంనగర్‌లో గ్రానైట్ వ్యాపారులు అక్రమాలకు పాల్పడ్డారంటూ గతంలో ఈడీ ఎనిమిది సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఇవన్నీ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబసభ్యులు.. వారికి అత్యంత సన్నిహితులవేనని చెబుతున్నారు. ఈడీ నోటీసులు వచ్చిన చాలా కాలానికి సోదాలు చేస్తున్నారు. 


మొత్తంగా హైదరాబాద్‌తో పాటు కరీంనగర్‌లో 30 బృందాలు సోదాల్లో పాల్గొన్నాయి. గ్రానైట్ వ్యవహారంపై విచారించాయి. పలు డాక్యూమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ మైనింగ్ కేసులో 170 కోట్లు అవినీతి జరిగిందని.. అక్రమ మైనింగ్ చేస్తూ వేల కోట్లు రూపాయలు ప్రభుత్వానికి గండి కొడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.  రైల్వే, షిప్స్ లలో విదేశాలకు మైనింగ్ అక్రమ రవాణా చేస్తూ కోట్లు రూపాయలు సంపాదించారుని ఈడీకి ఫిర్యాదులు అందాయి.


ఈ నేపథ్యంలోనే గత ఏడాది మంత్రి ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లారు. అక్కడ గంగుల లేకపోవడంతో.. ఆయన కుటుంబసభ్యులతో అధికారులు మాట్లాడి వివరాలు సేకరించారు. రాష్ట్రంలో సీబీఐ విచారణకు అనుమతి లేకున్నా శ్రీనివాస్‌ అనే వ్యక్తి సీబీఐ నుంచి వచ్చానంటూ మంత్రి ఇంటికి వెళ్లినట్లు తెలిసింది. ఆయన నకిలీ సీబీఐ అధికారి అని ఆ తర్వాత తేలడంతో అతడిని ఢిల్లీలో అరెస్ట్‌ చేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు గంగుల ఇంటికి వెళ్లి ఆరా తీశారు