Delhi Liquor Scam case: హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్ (ED) మరోసారి నోటీసులు జారీ చేసింది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha)ను ఈడీ మరోసారి విచారించనుంది. అందులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ కూతూరు, ఎమ్మెల్సీ కవితకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం (జనవరి 16)న విచారణకు రావాలని కవితకు జారీ చేసిన నోటీసులలో ఈడీ పేర్కొంది.


ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా ఆమ్ ఆద్మీ పార్టీ నేతల మెడకు చిక్కుకున్న ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ పలుమార్లు విచారించింది. తెలంగాణ ఎన్నికల సమయంలో కవితను అరెస్ట్ చేస్తారని సైతం ప్రచారం జరిగింది. కానీ విచారణలో భాగంగా కవిత ఈడీ అధికారులకు సహకరించి, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈడీ ఆదేశాల మేరకు ఆమె వినియోగించిన ఫోన్లు, ఇతర పరికరాలు సైతం సబ్మిట్ చేయడం తెలిసిందే. చాలా రోజుల విరామం తర్వాత ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణకు హాజురు కావాలని కవితకు ఈడీ సమన్లు జారీ చేయడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.


గత మార్చి నెల నుంచి లిక్కర్ కేసులో కవిత 
గత మార్చి నెలలో ఢిల్లీ లిక్కర్‌ కేసులో కవిత ఈడీ విచారణకు పలుసార్లు హాజరైంది. ఈడీ ఆఫీసులో మహిళల విచారణ సీఆర్సీసీకి విరుద్ధం అంటూ అప్పటి నుంచి కవిత చెబుతూ వస్తున్నారు. దీనిపై అప్పుడే ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నళిని చిదంబరం తరహాలో ఇంటి వద్దే ఈడీ తనను విచారణ చేయాలని కవిత కోరుతున్నారు. ఈ క్రమంలో ఈడీ లాంటి దర్యాప్తు సంస్థల తీరును తప్పుబడుతూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇటీవల మళ్లీ ఈడీ ఆఫీసులో విచారణకు రావాలని నోటీసులు జారీ అవడంతో ఆమె సుప్రీంను ఆశ్రయించారు. ఆప్, వైసీపీ నేతలతో పాటు కవిత ఈ కేసులో విచారణను ఎదుర్కొన్నారు. 


కేజ్రీవాల్‌‌కు నాలుగోసారి సమన్లు జారీ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శనివారం నాలుగోసారి సమన్లు​జారీ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ప్రశ్నించేందుకు ఈడీ ఆయనకు నోటీసులు​జారీ చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో విచారణ నిమిత్తం జనవరి 18న ఈడీ కార్యాలయానికి హాజరు కావాలని కేజ్రీవాల్‌కు సూచించింది. ఇప్పుడు ఆప్ జాతీయ సమన్వయకర్త నాలుగోసారి విచారణకు హాజరవుతారో లేదో చూడాలి.


మూడుసార్లు కేజ్రీవాల్ గైర్హాజరు
మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే కేజ్రీవాల్‌ను సీబీఐ విచారించింది. గత ఏడాది ఏప్రిల్‌లో ఆయనను 9 గంటల పాటు ప్రశ్నించింది. అనంతరం పలు సార్లు ఈడీ నుంచి కేజ్రీవాల్‌కు సమన్లు వచ్చాయి.  నవంబర్ 2, డిసెంబరు 21న విచారణకు హాజరుకావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. కానీ ఈ విచారణలకు ఆయన  హాజరు కాలేదు. రెండు నోటీసుల తర్వాత జనవరి 3న విచారణకు విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. వాటిని ఏమాత్రం పట్టించుకోని కేజ్రీవాల్, బిజీ షెడ్యూల్ కారణంగా విచారణకు రాలేకపోతున్నట్లు ఈడీకి సమాచారం ఇచ్చారు.