TSPSC Case :   టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా టీఎస్పీఎస్సీ ఛైర్మన్    జనార్థన్ రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్ ను ఈడీ ఎదుట హాజరయ్యారు. వారి ఇద్దరి స్టేట్‌మెంట్‌ను ఈడీ అధికారులు నమోదు చేశారు.  ఇదే కేసులో రెండు వారాల కిందట టీఎస్‌పీఎస్సీ కీలక ఉద్యోగులు  శంకరలక్ష్మి, సత్యనారాయణలను ఈడీ ప్రశ్నించారు.  ఇద్దరి వాంగ్మూలాలు నమోదు చేశారు. శంకరలక్ష్మీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇంచార్జ్‌గా ఉన్న నేపథ్యంలో.. ప్రవీణ్, రాజశేఖర్‌లకు పేపర్లు ఎలా చేరాయనే వివరాలను ఈడీ ఆరా తీసింది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌కు సంబంధించి సిట్ నమోదు చేసిన కేసులో శంకరలక్ష్మీని పేర్కొంది.  అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని ఈడీ అధికారులు సూచించారు.  
 
తెలంగాణ పోలీసులు నమోదు చేసిన కేసులో మనీలాండరింగ్ జరిగినట్లుగా ఆధారాలు లభించడంతో ఈడీ కూడా విచారణ ప్రారంభించింది. గతంలో పేపర్ లీక్ కేసుకు సంబంధించిన మొత్తం 8 డాక్యుమెంట్ల ఇవ్వాలని  కోరింది. అయితే ఈడీ లేఖకు సిట్ అధికారులు స్పందించకపోవడంతో నాంపల్లి కోర్టును ఆశ్రయించింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదంటూ  పిటిషన్ దాఖలు చేసింది ఈడీ. ఈ కేసులో మనీ లాండరింగ్ కోణం లో దర్యాప్తు చేయాలని భావించిన ఈడీ..కేసు వివరాలు ఇచ్చేలా సిట్ కు ఆదేశాలు ఇవ్వాలని  పిటిషన్ లో కోరింది.  అటు ఈడి పిటిషన్ పై సిట్ కూడా  కౌంటర్ దాఖలు చేసింది. కేసు కీలక దశలో ఉన్నందున వివరాలు ఇవ్వడం కుదరదని వివరిచింది. దీనిపై విచారణ జరగాల్సి ఉంది.                 
 
టీఎస్పీఎస్సీ కేసులో ఆర్థిక లావాదేవీలపై ఈడీ దృష్టి పెట్టింది. పబ్లిక్ డొమైన్ ద్వారా ఇప్పటికే వివరాలు సేకరించిన ఈడీ.. ECIR నమోదు చేసింది. భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారాయని ఈడీ గుర్తించింది.ఈ కేసులో ప్రధాన నిందితులు రాజశేఖర్, ప్రవీణ్‌ కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై  నిందితుల తరపు న్యాయవాది స్పందనను తెలియజేయాల్సిందిగా అతనికి నోటీసులు జారీ చేసింది.  టీఎస్‌పీఎస్‌సీ నిందితుల వద్ద నుంచి సిట్ 7లక్షలు సేకరించింది. 40లక్షలు డబ్బులు చేతులు మారాయని గుర్తించింది. సిట్ అరెస్ట్ చేసిన నిందితుల్ని జైలుకు వెళ్లి ఈడీ అధికారులు ప్రశ్నించారు. 


ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో మొత్తం రూ.38 లక్షల మేర నగదు లావాదేవీలు జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు. సిట్ అధికారుల దర్యాప్తు ఆధారంగానే మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ విచారణ చేస్తోంది. ఖమ్మానికి చెందిన ఒక జంటను కూడా ఈడీ అధికారులు విచారించి.. నగదు లావాదేవీలు నిజమే అని ఒక స్పష్టతకు వచ్చారు. అందుకు సంబంధించిన బ్యాంకు ట్రాన్సాక్షన్స్ కూడా గుర్తించారు. న్యూజీలాండ్‌లో ఉంటున్న వ్యక్తి నగదు ఏ రూపంలో పంపారనే విషయాలను ఆరా తీస్తున్నారు. ఈ విషయాలపై చైర్మన్, కార్యదర్శికి అవగాహన ఉన్నదా అని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. లీక్ చేసిన వ్యక్తుల వ్యవహారశైలిపై అనుమానాలు రాలేదా అని కూడా ప్రశ్నించారని తెలుస్తున్నది.