అమరావతి: ఈ ఏడాది భారత్లో పలు రాష్ట్రాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉంటుందని కొన్ని రోజుల కిందట ఐఎండీ తెలిపింది. అయితే ఈ ఏడాది వానాకాలం ఆలస్యంగా ప్రారంభం కానుంది. నైరుతి రుతుపవనాలు జూన్ ఐదో తేదీ తర్వాతే తెలంగాణ రాష్ట్రాన్ని తాకే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దేశ దక్షిణ ప్రాంతాన్ని మే 25 నాడే తాకుతాయని తొలుత అంచనా వేశారు. కానీ ఎల్నినో (El Nino) పరిస్థితుల కారణంగా నైరుతి రుతుపవనాల కదలికల్లో వేగం తగ్గిందందని అధికారులు తెలిపారు.
హిందూ మహాసముద్రం, బంగాళాఖాతంలో విస్తరిస్తూ వచ్చిన నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం శ్రీలంక సగం వరకు వచ్చి నిలిచిపోవడంతో ఆలస్యం కానుంది. సాధారణంగా మే చివరికల్లా తెలంగాణను తాకాల్సిన రుతుపవనాలు, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో జూన్ 5 నుంచి 10వ తేదీ మధ్య వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ కారణాలతో ఈ ఏడాది సాధారణం కంటే వర్షపాతం తక్కువ నమోదయ్యే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొది. జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లోనూ వర్షాలపై ప్రభావం పడుతుందని తెలుస్తోంది.
ఈ నెలాఖరు వరకు భానుడి ప్రతాపమేబుధవారం, గురువారాల్లో తెలంగాణలో భానుడి భగభగలు ఇలాగే కొనసాగుతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండ తీవ్రత అధికంగా ఉండటం, ప్రజలు వడదెబ్బతో అధిక సంఖ్యలో చనిపోతుండటంతో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్' జారీ చేయగా, అక్కడ 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో వడగాలులు వీస్తున్నందున ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఎన్నో కుటుంబాలలో ఎండ తీవ్రత, వడగాలులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అదే సమయంలో ద్రోణి కారణంగా కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
మరోవైపు నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. ఏపీలో సోమవారం ఒక్కరోజే 18 మంది చనిపోగా, తెలంగాణలో 54 మంది వడదెబ్బ, ఎండ తీవ్రత కారణంగా చనిపోయారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 46 డిగ్రీల పైన, మరో 6 జిల్లాల్లో 45.2 నుంచి 45.8 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 16 జిల్లాల్లోని 145 మండలాల్లో తీవ్ర వడగాలులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 19 మండలాలు, మంచిర్యాలలో 17 మండలాల్లో, సూర్యాపేటలో 14, ఖమ్మంలో 13 మండలాలతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలు ప్రజలు ఎండ వేడికి తట్టుకోలేకపోతున్నారు.
ఏపీలోని కృష్ణా జిల్లాలోని కంకిపాడు, పెనమలూరు ప్రాంతాలలో గరిష్ఠంగా 48.1 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదు కాగా, బాపట్ల జిల్లా కూచినపూడిలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. మొత్తం 14 జిల్లాల పరిధిలో ఉన్న 115 మండలాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల మార్కును దాటడం ఎండ తీవ్రతను తెలుపుతుంది. ద్దం పడుతోంది. ఈ కోరలు చాచిన ఎండల వడదెబ్బకు తాళలేక వేర్వేరు ప్రాంతాల్లో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. మే నెలాఖరు వరకు ఎండల తీవ్రత ఇలాగే ఉంటుందని, ప్రజలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచిస్తున్నారు.
