Temparatures High in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా ఉంటున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏపీ, తెలంగాణలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో గరిష్టంగా 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని తెలిపారు. రాత్రి పూట ఉష్ణోగ్రతలు 22 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పగటి పూట వాతావరణం పొడిగా ఉంటుందని క్రమంగా ఎండల తీవ్రత పెరుగుతోందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. 


తెలంగాణలో ఇదీ పరిస్థితి


తెలంగాణలో ఎండలు రోజు రోజుకూ ముదురుతున్నాయి. మార్చి ప్రారంభం కాకుండానే ఉష్ణోగ్రతలు పెరిగాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 4 డిగ్రీల మేర పెరిగాయని పేర్కొంటున్నారు. పగటి పూట ఉష్ణోగ్రతలు 32 నుంచి 37 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయని వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని.. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే, రాత్రి పూట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలుగా నమోదవుతున్నాయని చెప్పారు. 


గతేడాది మాదిరిగానే ఈసారి కూడా వడగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణలో రాత్రిపూట చల్లగా ఉన్నా.. పగటి పూట మాత్రం ఉక్క పెడుతోంది. గతేడాది ఈ సమయానికి 15 - 20 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. ఈసారి ఏకంగా 32 డిగ్రీలు దాటిపోయాయి. దీంతో ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మండుతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 


Also Read: Kavitha Case: కవిత కేసు మార్చి 13కి వాయిదా - సమయం లేదని విచారణ చేపట్టని సుప్రీంకోర్టు !