కర్ణాటకలో కాంగ్రెస్ హామీలు విఫలం చెందాయని, కాంగ్రెస్ పార్టీ ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.  ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీకి  100 సీట్లు పక్కా వస్తాయని ఎమ్మెల్యే రామన్న స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.  


సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ మేనిఫెస్టో లో పొందుపరిచిన హామీల వివరాలను వెల్లడించడంతో పాటు ప్రతిపక్ష పార్టీల తీరును ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ.... అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచేలా ముఖ్యమంత్రి కేసీఆర్ మేనిఫెస్టోను రూపొందించారని అన్నారు. 


ప్రజాభీష్టానికి అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించారని చెప్పారు. దేశంలో ఆయా రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్, బీజేపీలు పూర్తిగా విఫలం అయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ప్రజాక్షేత్రంలో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని ఎమ్మెల్యే జోగురామన్న స్పష్టం చేశారు.


రాష్ట్రంలోని 90 లక్షల కుటుంబాలకు భరోసా కల్పించేలా 5 లక్షల రూపాయల జీవిత బీమా అందించనున్నారని చెప్పారు.  సౌభాగ్య మహిళా పథకం కింద అర్హులైన మహిళలకు 3 వేల రూపాయల ఆర్ధిక సహాయం అందించేలా హామీ ఇచ్చారన్నారు. 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్, అగ్రవర్ణ పేదల కోసం రెసిడెన్షియల్ స్కూల్ లు, దశల వారిగా 5 వేల రూపాయల ఆసరా పెన్షన్ లను అందజేస్తామని హామీ ఇచ్చారన్నారు. రైతు బంధు ఆర్ధిక సహాయాన్ని 12 వేలకు పెంచడం సంతోషకరమని చెప్పారు. ఆరోగ్య శ్రీ కింద 15 లక్షలకు గరిష్ట పరిమితి పెంపు వంటి ప్రజా శ్రేయస్సు కోరే హామీలను మేనిఫెస్టో లో పొందుపర్చారని అన్నారు. దివ్యాంగులకు సైతం 6,016 రూపాయలకు పెన్షన్ ను పెంచే విధంగా హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. 


మానవీయ కోణంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలుస్తోందని స్పష్టం చేశారు. మేనిఫెస్టో పై టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండి పడ్డారు. కర్ణాటకలో బూటకపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో ఘోరంగా విఫలమయిన మాట వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. యువనిధి, ఉచిత రేషన్, డిప్లొమా చేసిన వారికి భ్రుతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమయిందని మండిపడ్డారు. 


అటు బీజేపీ సైతం ఇచ్చిన హామీలను బుట్టదాఖలు చేసిందని గుర్తు చేశారు. ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్, రైతులకు ఆదాయం రెట్టింపు హామీలను బీజేపీ పూర్తిగా విస్మరించిందని అన్నారు. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను సైతం నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కుతుందని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో వందకు పైగా సీట్లలో అఖండ విజయాలు సాధించనున్నామని దీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో డీసీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, పట్టణ అధ్యక్షులు అజయ్, మాజీ మార్కెట్ చైర్మన్ మెట్టు ప్రహ్లద్,  జైనథ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వేణుగోపాల్ యాదవ్, అధికార ప్రతినిధి గంగారెడ్డి, మహిళా పట్టణ అధ్యక్షురాలు స్వరూప రాణి, బుట్టి శివ, రాజన్న, పర్వీన్, తదితరులు పాల్గొన్నారు.