Telangana Congress News: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకరు కూల్చితే కూలిపోవడానికి.. అది కాళేశ్వరం ప్రాజెక్టు కాదని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. అంతర్యుద్ధం మా పార్టీలో కాదని.. హరీష్ తో మీ పార్టీలోనే వస్తోంది చూసుకో అని బీఆర్ఎస్ అగ్ర నేతలను ఉద్దేశించి అన్నారు. కామారెడ్డిలో తోపు అనుకున్న కేసీఆర్ ఎందుకు తుస్సు అన్నారో సమాధానం చెప్పాలని ప్రశాంత్ రెడ్డి నేడు (ఫిబ్రవరి 8) నిలదీశారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తాజాగా జగ్గారెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై జగ్గా రెడ్డి కౌంటర్ ఇచ్చారు.


ప్రశాంత్ రెడ్డి మీ హరీష్ రావు దగ్గర కాళేశ్వరం డబ్బులు ఉన్నాయని అన్నారు. ఆయన తన నియోజకవర్గంలో రూ.60 కోట్లు పంచి గెలిచారని జగ్గారెడ్డి ఆరోపించారు. తన దగ్గరే రూ.60 కోట్లు ఉంటే పట్ట పగలు చుక్కలు చూపెట్టే వాణ్ణని వ్యాఖ్యానించారు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మీ అభ్యర్థి గెలిచాడని.. పేద ప్రజలను మభ్య పెట్టి మీ అభ్యర్థి గెలిచాడని అన్నారు. తన దగ్గర కూడా రూ.60 కోట్లు ఉండి ఉంటే మీకు డిపాజిట్ వచ్చేది కాదని ఎద్దేవా చేశారు.


‘‘మీ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే.. ఇద్దరు ఇంజినీర్ ఇన్ చీఫ్ ల సస్పెన్షన్ వరకు వచ్చింది. ప్రశాంత్ రెడ్డి నీ బుర్రకు ఇప్పుడైనా ఎక్కిందా? నేను టార్గెట్ లీడర్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి లాంటి వాళ్లం అందరం టార్గెట్ లీడర్స్. మా లాంటి వారి వల్ల ఆయా చోట్ల రూ.60 కోట్లు పెట్టారు. మీ దగ్గర కాళేశ్వరం ఉంది.. మా దగ్గర ఏముంది అప్పులు తప్పా..!


 హరీష్ నల్ల ధనం ఎక్కడ పెట్టారో సీఎంకి చెప్తా. అన్ని లెక్కలు బయటకు రావాలి. 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్.. కామారెడ్డిలో ఎందుకు ఓడిపోయారు? కేసీఆర్ తోపు అంటారు కదా.. తోపు ఎందుకు తుస్సు అయ్యాడు. ప్రశాంత్ రెడ్డి సమాధానం చెప్పు? ఎదుటి వాడు ఏమంటారో ఆలోచించి మాట్లాడు ప్రశాంత్. ఎక్కువ మాట్లాడితే.. అన్నీ బయటకు తిస్తాం. మీ దగ్గర ఎమ్మెల్యేలు సీఎంని కలిసే వాళ్ళా? కేటీఆర్, హరీష్ దగ్గరికి పోయే వాళ్ళు. మీ ఎమ్మెల్యేలు కూడా మా దగ్గరికి వస్తే సీఎంని కలిసే వెసులుబాటు ఉంది.


రేపో మాపో మల్లారెడ్డి కూడా మా దగ్గరకు రావచ్చు. ఇప్పుడు ఆయన మాట్లాడటం లేదు కదా. 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారు. మా ప్రభుత్వం పడేస్తాం అంటున్నారు మీరు. అందుకే 20 మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు. మా ప్రభుత్వాన్ని కూల్చడం అంటే కూలిపోయే కాళేశ్వరం కట్టినట్టు అనుకుంటున్నవా? నాసిరకం సిమెంట్ తో కట్టినట్టు కాదు. 130 ఏండ్ల పునాది కాంగ్రెస్ ది. మా మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి’’ అని జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేశారు.