Telangana Congress MLC Candidates :  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భర్తీ చేయాల్సిన నాలాగు ఎమ్మెల్సీ సీట్లకు అభ్యర్థుల్ని ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.  ఎమ్మెల్యే కోటాలో అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్.. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ పేర్లను కాంగ్రెస్ ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. గురువారమే నామినేషన్లకు చివరి తేదీ ఉంది.  ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సంబంధించి గడువు ముగుస్తుంది. అనేక రకాల ఈక్వేషన్లు, అనేక రకాల వ్యక్తులను పరిగణలోకి తీసుకున్న తర్వాత అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఫైనల్ చేసినట్లుగా తెలు్సతోంది.  ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్  నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ రెండు స్థానాలు పోటీ లేకుండా కాంగ్రెస్ ఖాతాలోనే పడే అవకాశాలు ఉన్నాయి.                                   


అదే విధంగా గవర్నర్ కోటాకు సంబంధించి కోదండరామ్, జావెద్ అలీ ఖాన్ కొడుకు అమీర్ అలీ ఖాన్ పేర్లను ఖరారు చేశారు. సియాసత్ పత్రిక సంపాదకుడు జాహెద్ అలీ ఖాన్ కుమారుడు అమీర్ అలీ ఖాన్. జాహెద్ అలీ ఖాన్‌కే చాన్స్ ఇవ్వాలనుకున్నా ఆయన రాజకీయ పదవులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.  సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని ఈ నలుగురి ఎంపిక చేశారు.  అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ తమ ఎమ్మెల్యే సీట్లను త్యాగం చేశారు. అసెంబ్లీ కోఆర్డినేటర్ గా ఉన్నప్పటికీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు.                      


పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో బల్మూరి వెంకట్ హుజూరాబాద్ ఉప ఎన్నిక నుంచి పోటీ చేశారు. తక్కువ ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత పార్టీ ప్రయోజనాల దృష్ట్యా పోటీ నుంచి తప్పుకోవాలని పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్ ఇద్దరూ పోటీ నుంచి తప్పుకున్నారు. బల్మూరి వెంకట్ విద్యార్థి ఉద్యమం నుంచి ఉన్నారు. అనేక ఉద్యమాలు చేశారు. ఎన్ ఎస్ యూఐ తరపున అనేక విద్యార్థి ఉద్యమాలు నడిపించారు. టీఎస్ పీఎస్ సీలో పేపర్ లీక్, ఇతర అక్రమాలకు సంబంధించి గట్టిగా పోరాటం చేశారు. హైకోర్టును కూడా ఆశ్రయించారు. పార్టీ కోసం కష్టపడి పని చేశారు, జైలుకి కూడా వెళ్లారు.ఇక, అద్దంకి దయాకర్ పార్టీ వాయిస్ ను అనేక వేదికలపై బలంగా వినిపించారు.                 


కోదండరామ్‌కు కాంగ్రెస్ హైకమాండ్ ముందుగానే హామీ ఇచ్చింది. ఆ ప్రకారం ఇప్పుడు ఆయనను ఎమ్మెల్సీ చేస్తున్నారు. మంత్రి వర్గ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి కూడా ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. విదేశీ పర్యటనకు వెళ్లే ముందు రేవంత్ రెడ్డి మొత్తం జాబితాపై కసరత్తు చేసి వెళ్లారు. హైకమాండ్ నుంచి అధికారిక ప్రకటనే వెలువడాల్సి ఉంది.