Congress criticizes Pawan decision to campaign for BJP: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ బీజేపీ కోసం ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఈ అంశంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బుధవారం గాంధీ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ను పవన్ కాదు.. దిష్టికళ్యాణ్ అని సంబోధిస్తూ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో బీజేపీని ప్రజలు ఆదరించడం లేదని, అందుకే ఆ పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి భిక్షాం దేహీ అని అడిగారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ కేవలం ఆంధ్ర నాయకుడని, ఆయన గతంలో తెలంగాణ భాష, యాస గురించి నీచంగా మాట్లాడారని.. అటువంటి వ్యక్తి మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరని, ఆయన రాజకీయాలు ఆంధ్రాకే పరిమితం చేసుకోవాలని మహేష్ గౌడ్ ఘాటుగా హెచ్చరించారు.
మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపై జనసేన శ్రేణులు తీవ్రంగా స్పందించాయి. జనసేన పార్టీ కేవలం ఆంధ్రప్రదేశ్ కోసం పెట్టిన పార్టీ కాదని, అది జాతీయ సమగ్రత కోసం తెలంగాణ గడ్డ మీద ఆవిర్భవించిన పార్టీ అని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తరహాలోనే జనసేన కూడా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుందని గుర్తు చేశారు. తెలంగాణలో ప్రాంతీయ విభేదాలు సృష్టించి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తే జనసేన చూస్తూ ఊరుకోదని, ప్రజాస్వామ్యబద్ధంగా తమ బలాన్ని నిరూపించుకుంటామని కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ప్రచారంపై కాంగ్రెస్ ఎందుకు ఇంతలా భయపడుతోందని వారు ప్రశ్నించారు.
ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నిక కారణంగా పవన్ ప్రచారం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్తో విజయం సా ధించిన జనసేన, అదే జోష్ను తెలంగాణలోనూ కొనసాగించాలని భావిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ఈ "లోకల్ వర్సెస్ నాన్-లోకల్" వివాదం ముదిరిపోతోంది. పవన్ కళ్యాణ్ ప్రచార షెడ్యూల్ ఖరారైతే ఈ విమర్శలు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది.