CM Revanth Reddy Chit Chat: హైదరాబాద్‌లో (Hyderabad) తన కుటుంబ సభ్యులవి అక్రమ కట్టడాలని నిరూపిస్తే తానే దగ్గరుండి కూల్చేయిస్తానని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. బుధవారం సచివాలయంలో ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌, చెరువుల్లో ఎవరు నిర్మాణాలు చేసినా కూల్చేస్తామని స్పష్టం చేశారు. హైడ్రా హైదరాబాద్ వరకే పరిమితమని.. ఎక్కడ అక్రమ భవనాలు నిర్మించినా కూల్చేస్తామని చెప్పారు. సీడబ్ల్యూసీ సభ్యుడు పల్లంరాజు నిర్మాణాన్నే హైడ్రా మొదట కూల్చేసిందని.. జన్వాడ ఫాంహౌస్ లీజుకు తీసుకున్నట్లు అఫిడవిట్‌లో కేటీఆర్ ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. 'కేటీఆర్ ఫాంహౌస్‌కు సర్పంచ్ అనుమతి ఇచ్చారంటున్నారు. వారికి అనుమతులు ఇచ్చే అధికారం ఉండదు. నిర్మాణాలకు అధికారులే అనుమతిస్తారు. పదేళ్లుగా మంత్రిగా పని చేసిన కేటీఆర్‌కు ఈ విషయం తెలియదా.?. నా కుటుంబ సభ్యులు కబ్జా చేశారని కేటీఆర్ నిరూపిస్తే నేనే దగ్గరుండి కూల్చేయిస్తా.' అని సీఎం స్పష్టం చేశారు.


'అదే ప్రాధాన్యం'


హైడ్రా ఇప్పటివరకూ హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమని.. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్, చెరువులు, నాలాల ఆక్రమణల తొలగింపునకే తొలి ప్రాధాన్యమని సీఎం రేవంత్ అన్నారు. 'హైడ్రా తన పని తాను చేసుకుపోతుంది. ఎవరినీ వదిలిపెట్టేది లేదు. ఓఆర్‌ఆర్ అవతల ఉన్న గ్రామ పంచాయతీలు హైడ్రా పరిధిలో ఉన్నాయి. ఫామ్‌హౌస్‌లు కట్టుకున్న చాలా మంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు డ్రైనేజ్‌ను ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌ సాగర్‌లోకి వదులుతున్నారు. ఆ నీళ్లు హైదరాబాద్‌ ప్రజలు తాగాలా.? అందుకే కూల్చివేతలు. హైడ్రాకు పోలీస్ స్టేషన్ స్టేటస్ ఇస్తాం. ఎవరినీ వదిలిపెట్టేది లేదు. 30 ఏళ్ల కింద కట్టిన అక్రమ నివాస కట్టడమైనా హైడ్రా చర్యలు తీసుకుంటుంది. బీఆర్ఎస్ నేత హరీశ్ రావు సిద్ధమైతే ఆయన నేతృత్వంలోనే చెరువుల ఆక్రమణలపై నిజ నిర్ధారణ కమిటీ వేస్తాం' అని సీఎం పేర్కొన్నారు.


Also Read: Revanth Reddy: కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులపై రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ - ఆరోజు నుంచే స్టార్ట్


విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా..


ఒవైసీ కాలేజీల విషయంలో విద్యా సంవత్సరం నష్టపోతుందనే టైం ఇచ్చినట్లు సీఎం రేవంత్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఆ బిల్డింగ్ కూల్చాలా వద్దా అనేది ఆలోచిస్తున్నట్లు చెప్పారు. 'రాయదుర్గంలో కూల్చివేత సరైనదే. 111 జీవోపై సుప్రీంకోర్టు, ఎన్‌జీటీ గైడ్ లైన్స్ పాటిస్తున్నాం. చెరువులు, కుంటల్లో కొన్ని భవనాలు కట్టుకోవడానికి ఎక్సంప్షన్ ఇచ్చింది. సెక్రటేరియట్, జీహెచ్ఎంసీ వంటి భవనాలపై సుప్రీంకోర్టు అనుమతి ఉంది.' అని పేర్కొన్నారు.


రుణమాఫీపై..


రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి రైతుకు మాఫీ జరుగుతుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. రుణమాఫీపై అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందించారు. రూ.2 లక్షలపై రుణం తీసుకున్న వారు పై మొత్తాన్ని కడితే రుణమాఫీ అయిపోతుంది. వాటికి నిధులు కూడా విడుదల చేశాం. హరీశ్ రావు, కేటీఆర్ ప్రతి రైతు వద్దకు వెళ్లొచ్చని.. రుణమాఫీ అవ్వని వారి వివరాలను సేకరించి కలెక్టర్‌కు ఇవ్వొచ్చని సూచించారు. 


Also Read: Telangana: సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ - డిసెంబర్‌ 9 నాటికి పూర్తి చేసేలా పనులు