Revanth Reddy Protest in Delhi: అదానీ కుంభకోణంపై ఈడీ విచారణ చేయాలని ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతిపత్రం ఇచ్చారు. ఈడీ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీఎం రేవంత్ తో పాటుగా ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, సల్మాన్ ఖుర్షీద్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు.


ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘అదానీ కుంభకోణంపై చట్ట సభల్లో సమాధానం ఇవ్వకుండా మోదీ పారిపోయారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2014 వరకు ప్రధానులు చేసిన అప్పు రూ.55వేల కోట్లు. పదకొండేళ్లలో ప్రధాని మోదీ చేసిన అప్పు లక్షా 15వేల కోట్లు. 16 మంది ప్రధానులు చేసిన అప్పు కంటే మోదీ రెండింతలు అప్పులు చేశారు. దేశంలో సాగునీటి ప్రాజెక్టులు తీసుకొచ్చిన ఘనత పండిట్ జవహర్ లాల్ నెహ్రూది. బ్యాంకుల జాతీయీకరణతో ఇందిరమ్మ పేదలకు బ్యాంకులను అందుబాటులోకి తెచ్చారు. సాహసోపేత నిర్ణయంతో పేదలకు భూములు పంచిన ఘనత ఇందిరమ్మది.




దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది రాజీవ్ గాంధీ. స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్ ప్రవేశ పెట్టిన మహానేత రాజీవ్ గాంధీ. హమ్ దో.. హమారే దో అన్నట్లు మోదీ అమిత్ షా వ్యవహారం ఉంది. ప్రపంచాన్ని దోచుకునేలా ఆ ఇద్దరి వ్యవహార శైలి ఉంది. దుష్టచతుష్టయం దేశాన్ని దోచుకుంటోంది. సెబీ చైర్ పర్సన్ తక్షణమే రాజీనామా చేయాలి.. లేకపోతే కేంద్రమే ఆమెను తొలగించాలి..  జరిగిన కుంభకోణంపై ఈడీ విచారణ చేపట్టాలి. ఎంత గొప్ప స్థానంలో ఉన్నా పార్టీ పిలుపునిస్తే పాటించాల్సిందే.. అందుకే నేను ముఖ్యమంత్రినైనా ఒక కార్యకర్తగా నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చా. 


ట్విట్టర్ టిల్లు ఎందుకు మాట్లాడటంలేదు?
దేశానికి బీజేపీ ముప్పుగా మారింది. ఈ ముప్పును తొలగించాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉంది. కుంభకోణంపై బీఆరెస్ నేతలు బీజేపీని ఎందుకు ప్రశ్నించడంలేదు? వాళ్లు విలీనమైతరో మలినమైతరో మాకు సంబంధం లేదు. బీజేపీని కేసీఆర్ ఎందుకు ప్రశ్నించడంలేదు. ట్విట్టర్ టిల్లు కేటీఆర్ ఈ దోపిడీ పై ఎందుకు మాట్లాడటంలేదు. దేశ సంపదను దోచుకుంటున్న బీజేపీకి బీఆరెస్ అనుకూలం అనడానికి ఇది నిదర్శనం. జేపీసీపై బీఆరెస్ విధానం స్పష్టం చేయాలి. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని బీఆరెస్ నేతలు మాట్లాడుతున్నారు. మీ తాత ముత్తాతలు దిగొచ్చినా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏం చేయలేరు.




విగ్రహంపై చేయి వేస్తే వీపు చింతపండే..
రాజీవ్ విగ్రహంపై చేయి వేస్తే వీపు చింతపండే. ఎవడు తొలగిస్తాడో రావాలి.. తారీఖు చెప్పాలి. పదేళ్ల తరువాత ఈ సన్నాసులకు తెలంగాణ తల్లి గుర్తొచ్చింది. కనిపించే తెలంగాణ తల్లి సోనియమ్మ. ఆమె జన్మదినం డిసెంబర్ 9న సచివాలయంలోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తాం. మేం తెలంగాణ తల్లికి నిజమైన వారసులమని నిరూపించుకుంటాం. రైతు రుణమాఫీపై బీఆరెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ సన్నాసులను నమ్ముకుని రైతులు రోడ్డెక్కొద్దు. ఈ ప్రభుత్వం ఉన్నదే మీ కోసం.. మీ సమస్యలను పరిష్కారం కోసం. పదేళ్లు మిమ్మల్ని దోచుకు తిన్న ఈ బీఆరెస్ దోపిడీ దొంగలను నమ్మొద్దు. పదేళ్లలో వాళ్లు ఇచ్చింది ఎంత... పది నెలల్లో మేం ఇచ్చింది ఎంత చర్చకు సిద్ధం. రాజీనామా చేయాల్సి వస్తుందని హరీష్ డ్రామాలు చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  బీఆరెస్ కు 39లో 9 కూడా మిగలవు’’ అని రేవంత్ రెడ్డి మాట్లాడారు.