Congress 6 Guarantees: తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆరు గ్యారెంటీల అమలు కోసం గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్‌గా దీపాదాస్ మున్షీ నియామకం అయిన తర్వాత తొలిసారి గాంధీభవన్‌ (Hyderabad Gandhi Bhavan)లో రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  (Revanth Reddy)  అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ భేటీలో లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహలతో పాటు పలు అంశాలపై చర్చించారు. అనంతరం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం ఎకరం స్థలం కేటాయించాలని నిర్ణయించారు. అలాగే స్టేట్ ఎస్సీ కమిషన్ ను రద్దు చేసి, దాని స్థానంలో కొత్త కమిషన్ ను తీసుకురావాలని నిర్ణయించారు.


తొలిసారి పీసీసీ విస్తృతస్థాయి సమావేశం 
అలాగే జోనల్ వ్యవస్థను సమీక్షించేందుకు కమిటీ వేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి పీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో ఏఐసీసీ కార్యదర్శులు, మంత్రులు, ఎన్నికల, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యలతో పాటు కాంగ్రెస్ జిల్లాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, పార్టీ అధికార ప్రతినిధలు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని రేవంత్ నిర్ణయించారు. ఆరు గ్యారెంటీల అమలు కోసం గ్రామ కమిటీలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింతగా చేరువ చేయవచ్చని తెలిపారు.  ప్రజలకు ఇచ్చిన హామీలను  తూచా తప్పకుండా అమలు చేస్తామన్నారు.  కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసినవారికి పదవులు వస్తాయని, పార్టీ గుర్తింపు ఇస్తుందని రేవంత్ చెప్పారు.


ఢిల్లీ పర్యటనకు రేవంత్ రెడ్డి 
రేపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. గురువారం ఢిల్లీలో ఏఐసీసీ భేటీ కానుంది. లోక్ సభ ఎన్నికలపై ఈ మీటింగ్‌లో చర్చించనున్నారు.  ఈ భేటీలో లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహలపై రాష్ట్ర నాయకత్వానికి కాంగ్రెస్ హైకమాండ్ దిశానిర్దేశం చేయనుంది. అందులో భాగంగా వివిధ రాష్ట్రాల సీఎంలు, పీసీసీ చీఫ్‌లతో అధిష్టానం సమావేశం కానుంది. ఈ భేటీలో పాల్గొనేందుకు రేవంత్ ఢిల్లీ వెళ్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు వైఎస్ షర్మిల సైతం హస్తినకు వెళుతున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున ఖర్గేతో భేటీ కానున్నారు. గురువారం వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో రేవంత్ ఢిల్లీకి వెళుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.  


రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడుసార్లు ఢిల్లీకి వెళ్లారు. గత ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా మోదీని కలిశారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో మర్యాదపూర్వకంగా మోదీని కలిశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలపై మోదీతో చర్చించారు. ఆ పర్యటన తర్వాత ఇప్పుడు మళ్లీ హస్తినకు రేవంత్ వెళుతున్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరనున్న క్రమంలో రేవంత్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.