Revanth Reddy 20 Years Political Journey ZPTC: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానానికి అండగా నిలిచిన మిడ్జిల్ గడ్డపై శనివారం భావోద్వేగ ప్రసంగం చేశారు. తాను రాజకీయాల్లోకి వచ్చి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నాగర్కర్నూల్ జిల్లా మిడ్జిల్లో ఏర్పాటు చేసిన భారీ కృతజ్ఞత సభ లో సీఎం పాల్గొన్నారు. 2006 జులై 4న మిడ్జిల్ మండల ప్రజలు నన్ను స్వతంత్ర జడ్పీటీసీ అభ్యర్థిగా ఆశీర్వదించారు. నాది ఈ నియోజకవర్గం కాకపోయినా కేవలం నమ్మకంతో గెలిపించారు. ఆరోజు మిడ్జిల్ ప్రజలు నాటిన చిన్న మొక్కే.. ఇవాళ మీ దయవల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి అనే మహా వృక్షమైంది అంటూ కృతజ్ఞతలు చాటుకున్నారు. ఇదే వేదికపై తనపై పోటీ చేసి ఓడిపోయిన రబ్బానీని గుర్తుచేసుకుంటూ.. ఆయనకు ప్రభుత్వంలో తగిన బాధ్యత ఇస్తామని, తన వల్ల ఎవరికీ నష్టం జరగకూడదన్నదే తన ఆలోచన అని ఉదారత చాటారు. గతంలో హైదరాబాద్ రాష్ట్రానికి తొలి సీఎంగా చేసిన బూర్గుల రామకృష్ణారావు, కేంద్రమంత్రిగా దేశానికి సేవలందించిన జైపాల్రెడ్డి లాంటి మహామహులు ఈ పాలమూరు బిడ్డలేనని రేవంత్ కొనియాడారు.
ఈ కృతజ్ఞత సభలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి మార్క్ పొలిటికల్ అటాక్కు వేదికగా మారింది. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుల అహంకారాన్ని ఎండగడుతూ సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అహంకారానికి, అహంభావానికి కూడా ఒక హద్దు ఉంటుంది. తెలంగాణ కోసం పోరాడిన ప్రజా గాయకుడు గద్దరన్నను ఎర్రటి ఎండలో గడీల ముందు 4 గంటల పాటు నిలబెట్టిన వాడ్ని మనం క్షమించాలా వద్దా అని ప్రశ్నించారు. ఆనాడు గద్దరన్నను అవమానించినందుకు కేసీఆర్కు ఉరిశిక్ష వేసినా తక్కువే అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ప్రజాపాలన పోవాలని కాంక్షిస్తున్న కేసీఆర్.. అరుంధతి సినిమాలో పశుపతిని గొలుసులతో బంధించినట్లు ఫామ్హౌస్లోనే కుంగి కృశించి పోవాలని, తెలంగాణ ప్రజలు ఆయనను అక్కడే బంధించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాజకీయ నాయకులు, అధికారులు మాట్లాడేది వింటే అర్థముంది.. కానీ కన్నబిడ్డలు, ఆడబిడ్డలు తమ ఇంటాయనతో మాట్లాడే వ్యక్తిగత విషయాలను వినేవాడు అసలు మనిషేనా ఆయన అసెంబ్లీకి రాడు కానీ.. మన ఫోన్లు వినడానికి మాత్రం వస్తాడు అంటూ కేసీఆర్ తీరుపై మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో చేసిన రూ.8.50 లక్షల కోట్ల అప్పుల లెక్కలపై మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారని, దానికి సమాధానం చెప్పే దమ్ము గులాబీ నేతలకు ఉందా అని రేవంత్ నిలదీశారు. తెలంగాణలో పేదలకు ఇళ్లు ఇవ్వకుండా, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటూ ప్రశ్నాపత్రాలను పల్లీబఠాణిల్లా అమ్ముకున్న పాపం బీఆర్ఎస్దేనని విమర్శించారు. దొరల దురహంకారాన్ని పాలమూరు గడ్డపై మరోసారి బొంద పెట్టాల్సిన అవసరం ఉందని కేడర్కు పిలుపునిచ్చారు. వందేళ్లుగా దేశంలో ఎక్కడా జరగని 'కులగణన'ను తమ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో చేపట్టి దేశానికే దిక్సూచిగా నిలిచిందని సీఎం గర్వంగా ప్రకటించారు.
ఈ పర్యటనలో భాగంగా మిడ్జిల్ మండలంలో రూ.10 కోట్లతో పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. ఈ మండలాన్ని ప్రత్యేకంగా దత్తత తీసుకోవాలని భట్టిని కోరారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామగ్రామాన ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తూ, ఉచిత కరెంట్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ నిజమైన ప్రజాపాలన అందిస్తున్నామని స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబానికి గజ్వేల్లో వెయ్యి ఎకరాల ఫామ్హౌస్లు, వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలంతా ఆలోచించాలని.. మళ్లీ వారి దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని సీఎం రేవంత్ రెడ్డి మిడ్జిల్ సభ ముఖంగా పిలుపునిచ్చారు.
