ముంబై: భారత్లో అగ్రగామి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలలో ఒకటైన యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ (Axis Mutual Fund) తమ సరికొత్త సరికొత్త ఫండ్ ఆఫర్ (NFO) 'యాక్సిస్ నిఫ్టీ50 ఈక్వల్ వెయిట్స్ ఇండెక్స్ ఫండ్'ను ఆవిష్కరించింది. ఇది ఒక ఓపెన్ ఎండెడ్ ఇండెక్స్ స్కీమ్. ఇది నిఫ్టీ50 ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ను ఫాలో అవుతూ ఒక ప్రత్యేకమైన 'ఈక్వల్-వెయిటెడ్' వ్యూహం ద్వారా నిఫ్టీ 50 లోని భారత అగ్రగామి బ్లూ-చిప్ కంపెనీల వైవిధ్యభరితమైన పోర్ట్ఫోలియోలో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని ఇన్వెస్టర్లకు కల్పిస్తుంది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ (NFO) 2026 జూలై 3న ప్రారంభం కాగా జూలై 17వ తేదీతో ముగుస్తుంది.
ఈ Axis Nifty50 Equal Weights Index Fund ఫండ్ నిఫ్టీ50 ఈక్వల్ వెయిట్ టీఆర్ఐకి అనుగుణంగా రాబడులను అందించడం లక్ష్యంగా పని చేస్తుంది. నిబంధనలకు కట్టుబడి ఇండెక్స్లోని మొత్తం 50 స్టాక్స్లో సమానంగా పెట్టుబడి పెడుతుంది. ఈ కేటాయింపును స్థిరంగా కొనసాగించడం కోసం ప్రతి 3 నెలలకోసారి పోర్ట్ఫోలియోను రీబ్యాలెన్స్ చేస్తుంది. దీనివల్ల మార్కెట్ హెచ్చుతగ్గుల కారణంగా పెట్టుబడులు కేవలం కొన్ని కంపెనీల వైపే మొగ్గుచూపకుండా, ప్రతి స్టాక్పై సమానమైన ఫోకస్ ఉండేలా చూస్తుంది. ఈ క్రమబద్ధమైన, పారదర్శకమైన విధానం వల్ల ఎలాంటి వ్యక్తిగత అంచనాలకు అవకాశం ఉండదు.
ఈ ఫండ్ లాంచ్ సందర్భంగా యాక్సిస్ ఏఎంసీ ఎండీ అండ్ సీఈఓ బి. గోప్కుమార్ మాట్లాడుతూ.. ఇన్వెస్టర్లకు మరింత బ్యాలెన్స్డ్, వైవిధ్యభరితమైన విధానంలో భారత అగ్రగామి బ్లూ-చిప్ కంపెనీలలో భాగస్వామ్యం అయ్యే సరికొత్త అవకాశాన్ని కల్పించాలనేదే తమ ఉద్దేశ్యమని పేర్కొన్నారు. సరళత, పారదర్శకతలను కాపాడుకుంటూనే, భిన్నమైన పెట్టుబడి అవసరాలకు ఉపయోగపడే పటిష్టమైన ఫండ్స్ను అందించడమే తమ వ్యూహమని స్పష్టం చేశారు. ఇన్వెస్టర్లు తమ ప్రధాన పోర్ట్ఫోలియోకు అదనంగా సమర్థవంతమైన మరియు వైవిధ్యభరితమైన ప్యాసివ్ ఫండ్స్ వైపు మొగ్గు చూపుతున్న సమయంలో ఇటువంటి విధానాలు దీర్ఘకాలంలో మంచి వాల్యూ ఇస్తాయని తాము నమ్ముతున్నట్లు ఆయన వెల్లడించారు.
నిఫ్టీ50 ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ ఎందుకు?
సాధారణ నిఫ్టీ 50 ఫండ్లో పెద్ద కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కానీ, ఈ నిఫ్టీ50 ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ మాత్రం ఇండెక్స్లోని ప్రతి కంపెనీకి ఒకే విధమైన వెయిటేజీని కేటాయిస్తుంది. దీనివల్ల మొత్తం 50 కంపెనీలలో పెట్టుబడులు సరిగ్గా పంపిణీ అయి, కేవలం కొన్ని పెద్ద స్టాక్స్పైనే ఆధారపడటాన్ని తగ్గుతుంది. గత డేటా ప్రకారం, ఒకే రకమైన రిస్క్ ఉన్నప్పటికీ, నిఫ్టీ 50 టీఆర్ఐ తో పోలిస్తే నిఫ్టీ50 ఈక్వల్ వెయిట్ టీఆర్ఐ వివిధ సమయాల్లో మెరుగైన రాబడులు అందించింది. ఈక్వల్-వెయిట్ వ్యూహాలపై ఇన్వెస్టర్లలో ఆసక్తి వేగంగా పెరుగుతుండటంతో 2019-20లో సుమారు రూ.100 కోట్లుగా ఉన్న ఈ ప్యాసివ్ స్కీమ్ల ఆస్తుల నిర్వహణ (AUM), 2025-26 నాటికి దాదాపు రూ.10,000 కోట్లకు పెరిగింది.
కనీస పెట్టుబడి ఎంత..
ఈ NFO స్కీమ్లో కనీస పెట్టుబడి రూ.100 నుండి ప్రారంభించవచ్చు. తక్కువ మొత్తంలోనూ ఇప్పుడు చేసే ఇన్వెస్ట్ మెంట్ భవిష్యత్తులో మెరుగైన రాబటి అందిస్తుందని కంపెనీ పేర్కొంది. అలాట్మెంట్ జరిగిన 15 రోజుల్లోపు కనుక విత్డ్రా చేసుకున్నా లేదా వేరే ఫండ్లోకి మార్చుకుంటే 0.25 శాతం ఛార్జీ ఉంటుంది. 15 రోజుల తర్వాత చేసుకుంటే ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు.
Note: స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి. ఏబీపీ దేశం ఎవరికీ పలానా స్టాక్, ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలని సూచించదు. కనుక ఏదైనా స్టాక్, మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టడానికి ముందు ఆర్థిక నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోవడం మంచిది.
