Investments in Telangana: హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన సక్సెస్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి టీమ్ దావోస్ పర్యటనతో రూ.40,232 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలతో కొత్త రికార్డు నెలకొల్పింది. గత ఏడాది దావోస్‌లో తెలంగాణ రాష్ట్రం సాధించిన పెట్టుబడుల మొత్తం కంటే ఇది రెండింతలు అని ప్రభుత్వ అధికారులు తెలిపారు.


తెలంగాణ సర్కార్‌తో ఒప్పందాలు చేసుకున్న కంపెనీలివే.. 
తెలంగాణ ప్రభుత్వంతో అదానీ గ్రూప్, JSW, వెబ్ వర్క్స్, టాటా టెక్నాలజీస్, BL ఆగ్రో, సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్, గోడి ఎనర్జీ, అరజెన్ లైఫ్ సైన్సెస్, ఇన్నోవెరా ఫార్మాస్యూటికల్స్, క్యూ సెంట్రియో, సిస్ట్రా, ఉబర్, ఓ9 సొల్యూషన్స్‌  తదితర కంపెనీలు అగ్రిమెంట్ చేసుకున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. 


చిన్న, సన్నకారు రైతుల పక్షాన నిలబడాలని ప్రపంచ దిగ్గజ కంపెనీలకు దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ను ఆసియా మెడికల్ టూరిజం రాజధానిగా మార్చడానికి హెల్త్ కేర్ ను సాఫ్ట్ వేర్ తో సమ్మిళితం చేయాలన్నారు రేవంత్ రెడ్డి. ఖరీదైన హెల్త్ కేర్ సేవల ఖర్చులను తగ్గించేందుకు  అమెరికా, యూరప్ దేశాలు పని చేస్తున్నాయని అన్నారు.  హెల్త్ కేర్ సేవలను అందరికీ అందుబాటులో ఉంచేందుకు,  అధునాతన వైద్య సేవలను  ప్రతి మారుమూల ప్రాంతాల ప్రజలకు చేరుకోడానికి  డిజిటల్, సాంకేతికను ఉపయోగించాలని సూచించారు.  






దావోస్‌కు రావడం.. ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన వ్యాపారవేత్తలను కలుసుకోవటం సంతోషంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ‘అభివృద్ధితో పాటు సంక్షేమం అందించాలంటే పెట్టుబడులు, వృద్ధి కలిసి రావాలి. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించేందుకు నిరంతరం మా ప్రయత్నం కొనసాగుతుంది. పారిశ్రామికవేత్తలందరూ హైదరాబాద్ కు రావాలి...‘ అని రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు.


మూసీ నది పునరుజ్జీవం, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు రూపకల్పనలో భాగంగా ఇతర దేశాల్లో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను తెలుసుకునేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లండన్ లో పర్యటించారు. లండన్ లోని థేమ్స్ నదిని సందర్శించారు.  థేమ్స్ నది నిర్వహిస్తున్న తీరును, అక్కడి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధి చేసిన తీరును ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి గురువారం అక్కడి థేమ్స్ రివర్ పాలక మండలి, పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ అధికారులు, నిపుణులతో దాదాపు మూడు గంటల పాటు  చర్చలు జరిపారు. 


Also Read: Harish Rao: అదే జరిగితే ఏపీకి లాభం, తెలంగాణకు మరింత నష్టం: హరీష్ రావు కీలక వ్యాఖ్యలు