పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు ఎత్తిపోతల వెట్ రన్ కు ముహూర్తం ఖరారు అయింది. ప్రపంచంలోనే భారీ పంపులతో ఈ ఎత్తిపోతలను నిర్మించినట్లుగా ప్రభుత్వం చెబుతోంది. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి ఇటీవల డ్రైన్‌ను అధికారులు విజయవంతంగా నిర్వహించారు. ఈ క్రమంలో తాజాగా వెట్‌ రన్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 16న వెట్‌ రన్‌ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నార్లాపూర్‌ ఇన్‌టేక్‌ వద్ద స్విచ్ ఆన్‌ చేసి వెట్ రన్ ప్రారంభం చేయనున్నారు. 


వెట్‌ రన్‌లో భాగంగా 2 కిలో మీటర్ల దూరంలో ఉన్న నార్లాపూర్‌ రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోయనున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ కృష్ణా నదికి పూజలు చేస్తారు. వెట్‌ రన్‌ జరిగిన అనంతరం అక్కడే భారీ బహిరంగంగా నిర్వహించనున్నారు. ఈ సభలో సీఎం కేసీఆర్‌ ప్రాజెక్టు గురించి, దానివల్లే లాభాల గురించి, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.ఎత్తిపోతల కృష్ణమ్మ జలాలను కలశాలతో ప్రతి గ్రామానికి తీసుకెళ్లి ఈ నెల 17న ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రతి గ్రామంలో దేవుళ్ల పాదాలకు అభిషేకం చేయనున్నారు.


దక్షిణ తెలంగాణకు పండుగ రోజు : సీఎం కేసీఆర్‌


పర్యావరణ అనుమతులతో పాటు అనేక అడ్డంకులను అధిగమించి చేపట్టిన పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో దక్షిణ తెలంగాణలోని పల్లెపల్లెకు తాగునీరు, సాగునీరు అందనుందని, బంగారు తెలంగాణ లక్ష్యం సంపూర్ణం కానుందని సీఎం పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అడ్డంకులు తొలిగి కొలిక్కి వచ్చినందుకు గ్రామాల్లోని దేవాలయాల్లో స్వామివారి పాదాలను పాలమూరు జలాలతో అభిషేకం చేసి మన మొక్కులు చెల్లించుకుందామంటూ సీఎం కేసీఆర్‌ పిలుపు ఇచ్చారు. ఎన్నో మొక్కులు మొక్కితే, దైవకృపతో, ఇంజినీర్ల కృషితో, పాలమూరు ఎత్తిపోతల పథకం అడ్డంకులు అధిగమించి సాకారమైందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన స్ఫూర్తితో పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయాలని, పట్టుదలతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను కొలిక్కి తేవడానికి జరిగిన కృషి లో కీలక పాత్ర పోషించిన సీఎంఓ అధికారులకు, ఇరిగేషన్ ఉన్నతాధికారులకు ధన్యవాదాలు తెలిపారు.