ధరణి వద్దన్న వ్యక్తిని గిరాగిరా తిప్పి బంగాళాఖాతంలో విసిరేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. మంచిర్యాలలో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ను సీఎం కేసీఆర్ ప్రారంభించిన అనంతరం.. ప్రగతి నివేదన సభ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘‘మంచిర్యాల జిల్లా కావాలనేది ప్రజల చిరకాల కాంక్ష. ఎన్నో పోరాటాలు చేశారు. గత ప్రభుత్వాలు ఏవీ పట్టించుకోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రత్యేక జిల్లా చేసుకున్నాం.
సింగరేణి విషయంలో కీలక విధానం - కేసీఆర్
‘‘మన దేశంలో బొగ్గుకు కొరత లేదు. సింగరేణితో పాటు, ఈస్టర్న్ కోల్స్, వెస్టర్న్ కోల్ మైన్స్ ఉండగా అన్నీ ప్రైవేటు పరం చేస్తామని చెప్తున్నారు. మన దేశంలో బొగ్గు కొరత లేనే లేదు. దిక్కుమాలిన పాలసీలతో కేంద్ర ప్రభుత్వం మొత్తం అమ్మేస్తుంది. సింగరేణి ఎండీని నేను ఇండోనేసియా, ఆస్ట్రేలియా కూడా పంపా. ఖమ్మం జిల్లాలో ఇనుప ఖనిజ నిల్వలు ఉన్నాయి. వజ్రపు తునక లాంటి సింగరేణికి మైనింగ్ అనుభవం ఉంది. మిగతా గనుల తవ్వకాలు ఎక్కడ ఉన్నా సింగరేణికే అప్పగించాలని మేం నిర్ణయం తీసుకున్నాం. ఇంత బొగ్గు ఉన్నా దాన్ని వాడకుండా ఆస్ట్రేలియా, ఇండొనేసియా నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటున్నారు. దేశంలోనే అన్యాయం జరుగుతోంది కాబట్టి, టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి పోరాటానికి నడుం బిగించాం. సింగరేణిని కాంగ్రెస్ పార్టీ సగం ముంచితే, బీజేపీ మిగతా సగం ముంచుతామని చెబుతోంది.
మోదీ ఇక్కడికి వచ్చి సింగరేణిని ప్రైవేటు పరం చేయబోమని చెప్పి, బెంగళూరుకు వెళ్లి టెండర్లు పిలిచారు. దేశంలో ఉన్న 361 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలతో మొత్తం దేశవ్యాప్తంగా 24 గంటల కరెంటు అందించొచ్చు. దేశ రాజధాని ఢిల్లీలోనే పవర్ కట్స్ ఉన్నాయి. నాణ్యంగా, లోఓల్టేజ్ లేకుండా కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. మన దగ్గరున్న బొగ్గు నిల్వలతో దేశ వ్యాప్తంగా 150 సంవత్సరాలపాటు 24 గంటల కరెంటు ఇచ్చే సామర్థ్యం మనకి ఉంది’’ అని కేసీఆర్ అన్నారు.
సింగరేణిలో ఉద్యోగ నియామకాలు పెంచాం
‘‘సింగరేణిలో నూతన నియామకాలు చేసుకుంటున్నాం. 10 సంవత్సరాల కాంగ్రెస్ సామ్రాజంలో 6453 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత డిపెండెంట్ ఉద్యోగాల హక్కును పునుదర్ధరించి 19,463 ఉద్యోగాలను కల్పించాం. 15,256 మందికి డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించాం. సింగరేణిలో ప్రమాదం జరిగి కార్మికులు చనిపోతే గత ప్రభుత్వాలు రూ. లక్ష ఇచ్చి చేతులు దులుపుకునేది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.10 లక్షలు ఇస్తుంది అని తెలిపారు. వడ్డీ లేకుండా రూ. 10 లక్షల రుణం ఇంటి కోసం ఇస్తున్నాం’’ అని కేసీఆర్ తెలిపారు.