KCR on Runamafi: రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని రేపటి (ఆగస్టు 3) నుంచి పున: ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) నిర్ణయించారు. తెలంగాణ రైతుల సంక్షేమం వ్యవసాయ అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని అన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని సీఎం అన్నారు. రాష్ట్రంలో రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని పున: ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రగతి భవన్ లో బుధవారం (ఆగస్టు 2) నాడు సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరిగి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకున్నందున మళ్లీ రుణమాఫీని మొదలు పెట్టాలని అన్నారు.


ఈ సమీక్షా సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, సీఎం ముఖ్య సలహాదారు సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హెచ్ఎండీఏ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు లు పాల్గొన్నారు.


కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఏర్పడిన మందగమనం, కరోనా వల్ల సంభవించిన ఆర్థిక సమస్యలు, ఎఫ్ఆర్బీఎం నిధులను విడుదల చేయకుండా కేంద్రం, తెలంగాణ పట్ల అనుసరించిన కక్షపూరిత చర్యలు.. తదితర కారణాల వల్ల ఆర్థిక లోటుతో ఉన్నామని అన్నారు. వీటి వల్లే ఇన్నాళ్లు కొంత ఆలస్యమైందని సీఎం కేసీఆర్ తెలిపారు.  


రైతుల్ని ఉన్నతంగా తీర్చిదిద్దేదాకా విశ్రమించం - కేసీఆర్


ఈ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘ఇచ్చిన మాట ప్రకారం, రైతు రుణమాఫీ కార్యక్రమం కొనసాగించినం. కరోనా వంటి అనుకోని ఉపద్రవాల వల్ల., కేంద్రం ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం నిధుల్లో ఏకపక్షంగా కోత విధించడం, తెలంగాణకు విడుదల చేయాల్సిన నిధుల విషయంలో కక్షపూరితంగా వ్యవహరించడం వల్ల రైతు రుణమాఫీ కార్యక్రమంలో కొంతకాలం పాటు జాప్యం జరిగింది. రైతులకు అందిచాల్సిన రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ సాగునీరు వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో నిరాటంకంగా కొనసాగిస్తూనే వస్తుంది. మేము ఇప్పటికే చెప్పినట్టు ఎన్ని కష్టాల,  నష్టాలు వచ్చినా ఆరు నూరైనా రైతుల సంక్షేమాన్ని వ్యవసాయాభివృద్ధి కార్యాచరణను విస్మరించే ప్రసక్తే లేదు. పైగా వ్యవసాయ అభివృద్ధి కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు వంటి ఆదర్శవంతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నాం. తద్వారా రైతు సాధికారత సాధించే వరకు వారిని ఆర్థికంగా ఉన్నతంగా తీర్చిదిద్దే వరకు విశ్రమించే ప్రసక్తేలేదు.’’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.


ఇప్పటికే అందించిన రుణమాఫీ పోను మరో రూ.19 వేల కోట్ల రూపాయల రుణమాఫీని రైతులకు అందించాల్సి ఉందని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రేపు అనగా ఆగస్టు 3 వ తేదీ నుంచి పున: ప్రారంభించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును కార్యదర్శి రామకృష్ణారావును సీఎం కేసీఆర్ ఆదేశించారు.  రైతుబంధు తరహాలో విడతల వారీగా కొనసాగిస్తూ నెలాపదిహేను రోజుల్లో, సెప్టెంబర్ రెండో వారం వరకు, రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.